హైదరాబాద్, జనవరి 12 : దేశవ్యాప్తంగా వ్యవసాయరంగాన్ని కుదేలుచేసేలా పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు మోదీకి ఒక లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం..
ప్రియమైన నరేంద్ర మోదీ జీ..
దేశంలో, మా రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా పరిణమించే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ లేఖను రాస్తున్నాను. 2022 నాటికి అంటే ఆరేండ్లలో.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఐదేండ్లు గడుస్తున్నప్పటికీ ఆ దిశగా నిర్దిష్టమైన, నిర్మాణాత్మకమైన ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రారంభించలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే మీ విధానానికి విరుద్ధంగా ఇన్పుట్ ఖర్చులు (పెట్టుబడి) రెట్టింపై అందరినీ నిరాశ, నిస్పృహలకు గురిచేశాయి. ఈ ప్రభావంతో ఐదేండ్లలో రైతుల ఆదాయం భారీగా క్షీణించి యావత్తు రైతాంగాన్ని ఆందోళనకర పరిస్థితుల్లోకి నెట్టేసింది.
యూరియా, డీఏపీ తదితర ఎరువుల వాడకాన్ని తగ్గించాలంటూ రాష్ర్టాలను ఒకవైపు ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు ఎరువుల ధరలను గుడ్డిగా పెంచుతూ పోతున్నది. పంటల సాగులో అత్యధికంగా వినియోగించే 28.28.0 ఎరువుల ధరను 50 శాతం, కాంప్లెక్స్ ఎరువుల ధరలను వంద శాతానికి గత 90 రోజుల్లోనే పెంచడం విచారకరం. ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరుకుల మీద దిగుమతి సుంకాన్ని భరిస్తూ ధరలను రైతులకు అందుబాటులో ఉంచాల్సిన కేంద్రం.. ఆ భారాన్ని రైతుల నెత్తిమీదే రుద్దుతున్నది. రాష్ర్టాల్లో వ్యవసాయ యాంత్రీకరణ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో పెట్రోలు, డీజిల్ వాడకం కూడా పెరుగుతున్న సంగతి మీకు తెలిసిందే. కేంద్రం విధిస్తున్న అసంబద్ధ సెస్ల కారణంగా పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి రైతులకు అదనపు బాధను కలిగిస్తున్నది. పెట్రోలు, డీజిల్ ధరలు, ఎరువుల ధరల విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల దేశ రైతాంగం తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారు.
దేశంలో ఏడు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఎరువుల సబ్సిడీ విధానాన్ని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా మార్చేయడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలచుకొన్నాను.
సాగు ఖర్చులో కొంతవరకైనా ప్రభుత్వం భరిస్తూ రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించవచ్చని భావించి.. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యకలాపాలకు అనుసంధానించాలని కోరుతూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పం పింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపటంలేదు.
రైతులకు గిట్టుబాటు ధర అందించే విషయంలో ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన పలు కీలక సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. కానీ స్వామినాథన్ సిఫారసులను అమలుచేస్తున్నామని కేంద్రం చెప్పుకోవటం రైతాంగాన్ని పక్కదారి పట్టించడమే అవుతుంది. స్వామినాథన్ కమిషన్ చేసిన మూడు కీలకమైన సిఫారసులను పక్కకు పెట్టడం ద్వారా మద్దతు ధర విషయంలో రైతాంగానికి కేంద్రం తీరని నష్టం చేస్తున్నది. ‘వ్యవసాయ సాగులో చోటుచేసుకొనే మొత్తం ఉత్పత్తి వ్యయంలో 50 శాతం మద్దతు ధరకు జోడించాలి’ అనే సిఫారసుతోపాటు ‘భూమి లీజు ధరలను కూడా ఉత్పత్తి వ్యయంలో కలపాలి’ అనే సిఫారసును, ‘సాగులో రైతు వినియోగించే ట్రాక్టర్లు, యంత్రాలు, తదితర సొంత వ్యవసాయ సాగు ఆస్తులు తదితర వ్యయాన్ని ఉత్పత్తి వ్యయానికి జోడించాలి’ అనే మరో కీలక సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో స్వామినాథన్ సిఫారసుల ప్రకారం 150 శాతం మద్దతు ధరను అమలుపరుస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకోవడం రైతులను తప్పుదారి పట్టించడమే అవుతుంది.
మద్దతు ధర ప్రకటించినట్టే ప్రకటించి చేతులు దులుపుకొంటున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనకుండా కొంత శాతాన్నే కొంటున్నారు. రైతాంగానికి తాము పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందనే భరోసాను కలిగించడంలో కేంద్రానికి సరైన వ్యవస్థ లేనేలేదు. పైగా అంతర్జాతీయ నాణ్యత పేరుతో రైతులు కనీస మద్దతు ధర పొందడానికి వీలు లేకుండా చేస్తున్నారు. వారు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతూ.. మార్కెట్లో అతి తక్కువ ధరకు అమ్ముకొనే పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ విధానాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా కాకుండా నష్టదాయకంగా మార్చుతున్నారు.
ఎరువుల ధరలను పెంచడం, ఇంధన ధరలను పెంచడం, లోపభూయిష్టమైన మద్దతు ధర విధానం అమలుతో కేంద్రప్రభుత్వం రైతుల పంట పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగేలా చేస్తున్నది. కేంద్రం.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న తన వాగ్దానాన్ని తానే ఉల్లంఘిస్తున్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ తప్పుడు విధానాలతోపాటు వ్యవసాయరంగంలో విద్యుత్తు సంస్కరణల పేరుతో కరెంటు మోటర్లకు మీటర్లు బిగించాలన్న నిర్ణయం కష్టజీవులైన రైతులకు మరింత నష్టం చేకూర్చనున్నాయి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎరువుల ధరలను పెంచొద్దని, అదనపు ధరలను కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోట్లాది రైతుల తరఫున నేను భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. తద్వారా రైతులపై భారం పడకుండా చూడాలని కోరుతున్నాను.
ఇట్లు
కే చంద్రశేఖర్రావు