హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం లేఖ రాశారు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అర్ధాంతరంగా అక్కడ కళాశాలల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు భారత్కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయా విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరారు. మానవతా దృక్పథంతో ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతి ఇవ్వాలన్నారు.
యుద్ధం కారణంగా దాదాపు 20వేలకుపైగా విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి వచ్చారని, దేశవ్యాప్తంగా వివిధ వైద్యకళాశాలల్లో వారు చదువుకునేలా నిబంధనలు సడలించాలన్నారు. విద్యార్థుల్లో చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారున్నారని, తల్లిదండ్రులు జీవితాంతం సంపాదించిన డబ్బులతో పిల్లలను వైద్య విద్య కోసం ఉక్రెయిన్కు పంపారన్న సీఎం కేసీఆర్.. వారి భవిష్యత్ను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్ విద్యార్థుల కోసం సరిపడా సీట్లను ఆయా వైద్యకళాశాలల్లో పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 700 మందికిపైగా ఉన్నారని, వారి విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా విద్యార్థుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కేసీఆర్ కోరారు.