హైదరాబాద్, జూలై 9, (నమస్తే తెలంగాణ): బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తున్న ఈ పండుగ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నదని పేర్కొన్నారు. తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ చాటిచెప్తున్నదని సీఎం తెలిపారు. మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వ కృషి: కొప్పుల
రాష్ట్రంలోని మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని, ముస్లింల విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ముస్లిం సోదర సోదరీమణులంతా సంతోషంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 204 గురుకుల పాఠశాలల ద్వారా మైనార్టీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నదని, రంజాన్ సందర్భంగా విందులు ఏర్పాటు చేసి, పేదలకు దుస్తులు అందజేస్తున్నదని గుర్తుచేశారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ‘షాదీ ముబారక్’ పథకం ద్వారా రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు.