హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): బంజారా/లంబాడాల ఆరాధ్య దైవం, సంత్ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకుడు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి లంబాడా/బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో బంజారాహిల్స్గా పిలుచుకుంటున్న ప్రాంతంలో, మూడు శతాబ్దాల క్రితమే సేవాలాల్ మహారాజ్ నడయాడారని, అదే బంజారాహిల్స్ నేలమీద వారి పేరుతో నిర్మించిన భవన్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దకుతుందనడానికి వారి జయంతి ఉత్సవాల నిర్వహణ మరో ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంసృతిక జీవన విధానాన్ని కాపాడటానికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి గొప్పదని వెల్లడించారు. తన ప్రజలను బయటి సమాజం నుంచి అనుక్షణం రక్షించుకొనే దిశగా సంత్ సేవాలాల్ జీవితాంతం పోరాటం సాగించారని పేర్కొన్నారు.
ఆ దిశగా వారు కల్పించిన చైతన్యం, వారు చేపట్టిన కార్యాచరణ దేశవ్యాప్తంగా ఉన్న లంబాడా/బంజారాలకు రక్షణ కవచంగా నిలిచిందని వివరించారు. బంజారాలకు స్ఫూర్తి ప్రదాతగా నాటి కాలంలో వారు చేసిన కృషి, విశ్వవ్యాప్తంగా ఉన్న బంజారాలకు వారిని ఆధ్యాత్మిక గురువుగా, తమ ఆరాధ్య దైవంలా కొలిచేలా చేసిందని గుర్తుచేశారు. బంజారా/లంబాడా వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు.
దేశానికే ఆదర్శంగా మన గిరిపుత్రులు
రాష్ట్రంలోని తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి.. ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చి, గ్రామ పరిపాలనలో వారిని భాగస్వాములను చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి తండా గ్రామపంచాయతీలో ఒక గ్రామ పరిపాలన భవన్ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. ఈ దిశగా గిరిజన సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
గిరిజన బిడ్డల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు, ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వారు దేశానికి కీర్తి తెచ్చే దిశగా ఎదుగుతుండటం తనకెంతో సంతోషంగా ఉన్నదని ఆనందం వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతోనే బంజారా భవన్ను వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా నిర్మించామని తెలిపారు. ఇందులో సంత్ సేవాలాల్ విగ్రహ ప్రతిష్ఠాపన చేశామని చెప్పారు. వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.