హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కుటుంబ జీవనానికి శ్రీసీతారామచంద్రమూర్తులు ఆదర్శమూర్తులని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా వు స్తుతించారు. కుటుంబ విలువలు క్షీణిస్తున్న వర్తమాన కాలంలో సీతారాముల ఆశయాలను, విలువలను అన్వయించుకుంటూ ఆదర్శవంతమైన కుటుంబ జీవనాన్ని కొనసాగించేందుకు శ్రీరామనవమి పండుగ ఒక ప్రత్యేక సందర్భమని పేర్కొన్నారు.
రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యోన్య దాంపత్యానికి మారుపేరైన సీతారాములను తమ ఆరాధ్య దైవాలుగా, ఇలవేల్పులుగా హిందువులు కొలుచుకుంటారని తెలిపారు. వసంత రుతువులోని చైత్రశుద్ధ నవమిన ఆదర్శ దంపతులైన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వాడవాడనా వైభవోపేతంగా దేశ ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవడం గొప్ప విషయమని చెప్పారు.
ఇంటికి పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతలకు, కట్టుబాట్లకు అ త్యంత విలువనిచ్చి, తండ్రి మాట కోసం కఠోర త్యాగాలను తన జీవితంలోకి ఆహ్వానించిన శ్రీరాముడు తరతరాలకు ఆదర్శనీయుడని స్తుతించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నమ్మిన సత్యశీలత, ధర్మనిరతిని ఆచరించి చూపిన శ్రీరాముని జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఏటా తరహాలోనే ఈ ఏడాది కూడా భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. శ్రీ సీతారామచంద్రస్వామి కృపాకటాక్షాలతో రాష్ట్రంతోపాటు, యావత్ భారతదేశం సుభిక్షింగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.