Harish Rao | కొడంగల్ : ఎవరెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. గెలిచేది.. హ్యాట్రిక్ సీఎం మన కేసీఆరే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. అందులో ఎవరికి అనుమానం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఎవర్నీ అడిగినా, ఏ సర్వే చూసినా గులాబీ జెండా, కేసీఆర్ గెలుస్తరని అంటున్నారని హరీశ్రావు తెలిపారు. కోస్గిలో 50 పడకల ఆస్పత్రిని మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
గ్యారెంటీగా గెలిచేది మనమే.. వచ్చేది మనమే అని మంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు కొడంగల్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తెచ్చే సనిలో కేసీఆర్ ఉన్నారు. ఆ పని జరగాలంటే కేసీఆర్ను దీవించాలి. డబ్బులు పంచి గెలవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి టీడీపీ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి, ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వచ్చిండు. రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలని, విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. న్యాయం గెలుస్తది.. ధర్మం నిలబడతది. రేవంత్ తప్పు చేశాడు.. కోర్టులో విచారించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనపై విచారణ అయ్యేది ఖాయం.. జైలుకు పోయేది కూడా ఖాయం. కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మి ఆగం కావొద్దు అని హరీశ్రావు కోరారు.
24 గంటల కరెంట్ దండగ అని రేవంత్ రెడ్డి అంటున్నాడని మంత్రి గుర్తు చేశారు. మూడు గంటల కరెంట్ ఇస్తే చాలని అంటున్నాడు. వ్యవసాయం చేస్తే అర్థమైతది కరెంట్ కష్టాలు. పాలమూరు నీళ్లు రావాలంటే పట్నం నరేందర్ రెడ్డి మళ్లీ గెలవాలి. మల్కాజ్గిరిలో రేవంత్ ఏం పని చేయాలే. అక్కడ ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి.. మళ్లీ రేవంత్ రెడ్డి కొడంగల్ వచ్చేందుకు యత్నిస్తున్నాడు. కాబట్టి మనం మోసపోతే గోసపడుతాం అని హరీశ్రావు హెచ్చరించారు. నారాయణపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభించబోతున్నాం అని మంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు పోతుంది. పొరుగున ఉన్న కర్ణాటకలో రైతులకు ఆరేడు గంటల కరెంట్ కూడా వస్తలేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మనం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. సాగుకు సరిపడా నీళ్లు ఇస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవిస్తే కృష్ణా జలాలు తీసుకొచ్చి మీ పాదాలను కడుగుతాం. బీఆర్ఎస్ మేనిఫెస్టో త్వరలోనే వస్తుంది. మహిళలు శుభవార్త వింటారు అని మంత్రి హరీశ్రావు తెలిపారు.