హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీన ఒకేరోజు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాలేజీలను ప్రారంభిస్తారని చెప్పారు. నిమ్స్ దవాఖానలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆయుష్ వెల్నెస్ సెంటర్ను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఇతర అధికారులతో కలిసి మంత్రి హరీశ్రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పుడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, నేడు వాటి సంఖ్య 26కు పెరగనున్నట్టు తెలిపారు. ఈ సంఖ్య వచ్చే సంవత్సరానికి 34కు చేరుతుందని చెప్పారు. రోగుల విజ్ఞప్తి మేరకు నిమ్స్లో ఆయుష్ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించామని వెల్లడించారు. ఇక్కడ ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి, సిద్ధ, యునానీ వంటి భిన్న రకాల వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్దిపేటలో 50 పడకల సామర్థ్యంతో మరో మూడు ఆయుష్ దవాఖానలు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానంలో ఉన్నదని, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నంబర్ వన్ కాబోతున్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. డాక్టర్ కావాలన్న తెలంగాణ విద్యార్థుల కలలను సీఎం కేసీఆర్ నిజం చేశారని చెప్పారు. ఒకప్పుడు వైద్య విద్య కోసం కర్ణాటక, మహారాష్ట్రతోపాటు చైనా, ఉక్రెయిన్, రష్యాకు వెళ్లేవారని, నేడు మన రాష్ట్రంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకొనే విధంగా జిల్లాకో కాలేజీని ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్దేని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 9 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావచ్చిందని చెప్పారు. తొలిదశ అడ్మిషన్స్ పూర్తయ్యాయని, రెండో దశ అడ్మిషన్స్ తుది దశలో ఉన్నట్టు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ద్వారా ఒకేరోజు ఒకేసారి 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. నర్సింగ్, పారామెడికల్ కాలేజీల సం ఖ్యను కూడా పెంచామని, జిల్లాకు ఒక బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. స్టాఫ్నర్స్, పా రా మెడికల్ సిబ్బంది, డాక్టర్ల సంఖ్యను పెం చుతూ దేశ అవసరాలను తీర్చేలా రాష్ట్ర వైద్యారోగ్యరంగాన్ని బలోపేతం చేస్తున్నదని తెలిపారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగెడుతున్న తెలంగాణకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం.. మళ్లీ తెలంగాణ గల్లీలోకి వచ్చి విమర్శిస్తున్నదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణకు గ్రామీణ అవార్డుల్లో 38 శాతం వచ్చాయని చెప్పారు. మెడికల్ కాలేజీ సీట్లలో ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నదని, పీజీ సీట్లలో ప్రతి లక్షకు 8 సీట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నదని వెల్లడించారు. మనం వైద్యారోగ్య రంగంలో దేశంలో మూడో స్థానంలో ఉన్నామని, మాతా శిశు మరణాలను తగ్గించటంలో, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడంలో కూడా నంబర్ వన్ స్థానంలో ఉన్నామని వివరించారు. ‘మీరు (కాంగ్రెస్, బీజేపీ) దేంట్లో ముందున్నారో చెప్పండి. మీరు అధికారంలో ఉన్న రాష్ర్టాలు బియ్యం కావాలని తెలంగాణను అడుగుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి తెలంగాణకు బియ్యం కోసం విజ్ఞప్తులు వచ్చాయి. పక్కన ఉన్న 10 రాష్ర్టాలకు అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణను 9 ఏండ్లలోనే సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు. అభివృద్ధికి తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చారు. తెలంగాణ తరహా పథకాలు కావాలని ఇతర రాష్ర్టాల రైతులు డిమాండ్ చేస్తున్నారు’ అని తెలిపారు. అనంతరం మంత్రికి నిమ్స్లోని నర్సింగ్ సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు.