న్యూఢిల్లీ: హస్తినలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జల్శక్తి మంత్రి షెకావత్ను కలువనున్నారు. అమిత్ షాతో ఈ మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అమిత్షాతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించనున్నారు.
కాగా, సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోదీని కలిసి యాదాద్రి దేవస్థానం పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకతీయ టెక్స్టైల్ పార్కుకు వెయ్యి కోట్లివ్వాలని, ప్రత్యేక గిరిజన వర్సిటీని నెలకొల్పాలని, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్ నవోదయ స్కూళ్లు మంజూరు చేయాలని, రెండు పారిశ్రామికవాడలను మంజూరుచేయాలని, పీఎంజీఎస్వై కింద అదనపు నిధులు ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రధానికి వినతి పత్రాలు సమర్పించారు.