హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో కొంచెం నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సీఎంకు కావాల్సిన అన్ని వైద్య పరీక్షలు చేయించారు. సీటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షలు కూడా నిర్వహించారు.
ఈ పరీక్షల్లో సీఎంకు కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లుగా తేలింది. మందులతో ఆ అల్సర్ తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు. అల్సర్ మినహా మిగతా అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. దాంతో అల్సర్ తగ్గడానికి అవసరమైన మెడికేషన్ను ప్రారంభించారు.
కాగా, సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం సాధారణంగానే ఉందని తెలిపారు. సీఎంకు సీటీ స్కాన్, ఎండోస్కోపీ నిర్వహించామని, ఆయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. అల్సర్ ఉన్నట్టుగా పరీక్షల్లో తేలిందని, సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు.