CM KCR | వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్ల కారణంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో నష్టపోయిన పంటలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న రైతులకు భరోసా ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో వారం రోజులుగా వడగండ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. వరి, మక్కజొన్నతోపాటు భారీస్థాయిలో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పంటనష్టానికి సంబంధించిన నివేదికను అధికారులు కేసీఆర్కు అందించారు. నివేదికను పరిశీలించిన సీఎం నేరుగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే నాలుగు జిల్లాల్లో పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కాగా, భారీ వర్షాలు కురిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో కూడిన బృందం వికారాబాద్ జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
ప్రగతి భవన్ నుంచి బయల్దేరిన ఆయన రోడ్డు మార్గంలో బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వర్ష ప్రభావిత ప్రాంతాలకు చేరుకుంటారు. ముందుగా ఖమ్మం జిల్లా బొనకల్ మండలం రామాపురంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రామాపురంతో పాటు గార్లపాడు, గోవిందాపురం, లక్ష్మీపురం, రావినూతల, ముష్టికుంట్ల గ్రామాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుని దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. రెడ్డికుంట తండా నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం వెల్లి అక్కడి పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బ తిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు.