హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి దివ్యక్షేత్రంలో సీఎం కేసీఆర్ మంగళవారం సుదీర్ఘంగా పర్యటించారు. సుమారు 8 గంటలపాటు గడిపిన సీఎం.. 8 కిలోమీటర్లకు పైగానే నడుచుకుంటూ కలియదిరిగారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి స్వదస్తూరీతో రాసిచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని ఆలయ ఈవో గీతకు కేసీఆర్ స్వయంగా అందించారు.
ఘన స్వాగతం
కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 12.40 గంటలకు టెంపుల్ సిటీ హెలీపాడ్కు చేరుకున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే సునీత, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఆలయ ఈవో గీత, వైటీడీఏ చైర్మన్ కిషన్రావు, సీఎంవో అధికారి భూపాల్రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త, సీఎం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం ఘాట్ రోడ్డు ద్వారా సీఎం బాలాలయానికి చేరుకున్నారు.
అకడ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి స్వాగతం పలికారు. వేదపండితులు, అర్చకులు పూర్ణకుంభంతో ఆలయంలోకి తీసుకెళ్లారు. బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీఐపీ ప్రవేశద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం.. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అకడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను తిలకించారు. గండి చెరువు, పుషరిణి, కల్యాణకట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రతమంటపం గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును మంత్రులతో పంచుకున్నారు.
సునీతమ్మా.. నీ జన్మ ధన్యం
స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డిని ఈ సందర్భంగా కేసీఆర్ అభినందిస్తూ.. ‘మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాలయం నిర్మాణం జరుగుతున్నది.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’ అన్నారు. వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన సీఎం ప్రధాన దేవాలయం గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంఖు, చక్ర నామాలతో ఇండోర్లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను పరిశీలించారు. అకడ మంటపంలో ఏర్పాటు చేసిన నరసింహస్వామి కల్యాణ ఘట్టాన్ని చిత్రించిన తంజావూరు చిత్రపటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను తనతో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లితో పంచుకున్నారు.
‘మీకు పీఆర్సీ వస్తుందా?’ అని సీఎం కేసీఆర్ ఆలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ వస్తుందని వారు సమాధానమివ్వడంతో సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం యాదాద్రిలోని రామలింగేశ్వరాలయంలో అభిషేక అర్చన చేసిన కేసీఆర్, వీవీఐపీ గెస్ట్హౌజ్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేశారు. సాయంత్రం కొండ కింద పూర్తయిన లక్ష్మీ పుషరిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణాలను, అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ నిర్మాణ పనులను, ప్రెసిడెన్షియల్ సూట్లను పరిశీలించారు. వీక్షకుల లాంజ్ నుంచి.. బంగారు వర్ణంలో కాంతులీనుతున్న ఆలయ గోపురాలను తాదాత్మ్యంతో తిలకించారు. అకడినుంచి మళ్లీ ఆలయం ప్రాకారం దగ్గరకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి, లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పలు సూచనలను చేశారు. యాదాద్రి పవిత్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని, టెంపుల్ సిటీ పరిధిలో మద్యపానం, ధూమపానం నిషేధాన్ని కఠినతరంగా అమలు చేయాలని ఆదేశించారు. శాకాహారాన్నే అనుమతించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, నార్ముల్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ కూడా ఉన్నారు.