హైదరాబాద్, మార్చి12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని ఏఐజీ దవాఖాన వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి నేతృత్వంలోని వైద్యబృందం కేసీఆర్కు పలురకాల పరీక్షలు నిర్వహించారు. సీటీ స్కాన్, ఎండోసోపీ చేసి అల్సర్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, మందులతో తగ్గిపోతుందని డాక్టర్ నాగేశ్వర్రెడ్డి వెల్లడించారు. వైద్యపరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్కు చేరుకున్నారు. కేసీఆర్ వెంట సతీమణి శోభ, మంత్రులు కేటీఆర్, హరీశ్, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులున్నారు.