CM KCR | హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని పేదల ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా.. నిబంధనల మేరకు ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయమైన హక్కులను కల్పించినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నోటరీ స్థలాలను జీవో 58-59 ప్రకారం క్రమబద్ధీకరించుకునేందుకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తక్షణమే తమ తమత నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలుపుకోవాలని సూచించారు.
అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం తెలిపారు. ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే సందర్భంలో వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి జీవో 58-59 గడువును పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం సానుకూలంగా స్పందించారు. మరో నెల రోజుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, నవీన్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు.