CM KCR | భారత రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ పొరపాట్లు చేశాయని మంగళవారం మీడియాతో చెప్పారు. వచ్చే నెలలో జరిగే ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల మాట ఎలా ఉన్నా బీజేపీ బలం తగ్గుతది. అహంకారం తగ్గుతది అని తెలిపారు.
ఐదు రాష్ర్టాల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ర్టాలు. పంజాబ్లో బీజేపీ సున్నా.. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ బలం తగ్గుతదని కేసీఆర్ అన్నారు. మిగతా మూడు రాష్ర్టాలు చాలా చిన్నవని, వాటి ఎన్నికల ఫలితాలతో పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు.. హక్కులపై కేంద్ర, రాష్ట్ర జాబితాలు, ఉమ్మడి జాబితాలు ఉన్నాయని, కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవన్నారు. సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా లేవన్నారు. కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని అన్నడని కొన్ని కుక్కలు మొరుగుతయి.. కొందరు నేతలు మాట్లాడతారన్నారు. దీనిపై చర్చ జరుగుతది కదా.. అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఏమిటో, బీజేపీ ఏమిటో దేశ ప్రజలు చూశారని సీఎం కేసీఆర్ అన్నారు. భారత్ తెలివైన దేశం.. మౌనంగా ఉండదు.. స్పందించాల్సిన అవసరం ఉంది. ఆల్టర్నేటివ్ శక్తి వస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది అర్థం అవుతుందన్నారు.