మహబూబాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): మానుకోటలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్ అయ్యింది. గురువారం మధ్యాహ్నం 12.15 గంటలకు జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్.. 2.45 గంటల వరకు పర్యటించారు. సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించిన సందర్భంలో విశేష స్పందన వచ్చింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు నిధులు, ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ప్రకటించినప్పుడు ఈలలు, చప్పట్లతో జనం హర్షం వ్యక్తం చేశారు. ‘మానుకోట రాళ్ల ప్రతాపం అందరికి తెలుసు’ అని చెప్పగా చప్పట్లు, ఈలలతో మద్దతు తెలిపారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి పేరు తలవగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో విగ్రహం, జిల్లాలోని ఏదైనా సంస్థకు రామచంద్రారెడ్డి పేరు పెడతామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీపై సర్వత్రా చర్చ జరిగింది.