తెలంగాణ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్కుమార్రెడ్డి ఎకసెక్కాల సన్నివేశం.. అట్లా కరెంటిస్తే తాను టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని కాంగ్రెస్ ముఖ్యనేత జానారెడ్డి సవాల్ విసిరిన సందర్భం…
24 గంటల కరెంటు!
8 ఏండ్ల కిందటి వరకు మనమెన్నడూ చూడని అద్భుతం..
మనకది లభిస్తుందని కలలోనూ ఊహించని సౌకర్యం..
24 గంటల నాణ్యమైన కరెంటు!
ఇవాళ్టికి, ఈ నిముషానికి కేంద్ర ప్రభుత్వమే కాదు,
ఒక్క డబులింజన్, సింగిలింజన్ రాష్ట్రమూ కనలేని స్వప్నం..
24 గంటల నిరంతరాయ కరెంటు!
వ్యవసాయానికి ఉచితంగా!
అన్ని రంగాలకూ ఆమోదయోగ్యంగా!
ఇది ఒక్క తెలంగాణలోనే ఎందుకు సాధ్యమైంది?
దేశంలో 28 రాష్ర్టాలు చేయలేనిది ఇక్కడే ఎలా వీలైంది?
విజయవంతమైన కరెంటు కథ వెనుక ఉన్నది కేసీఆర్ మేధో మథనం. తెలంగాణపై ప్రేమ. ఇక్కడి రైతు బాగుపడాలన్న తపన. విభజనకు ముందే తెలంగాణపై పూర్తి అధ్యయనం చేసిన కేసీఆర్.. విద్యుత్తు స్వావలంబనతోనే బంగారు తెలంగాణ, వ్యవసాయ విజయం సాధ్యమని నమ్మారు. అందుకు ఆరంచెల వ్యూహం అమలు చేశారు. ఇప్పటి అవసరాలు తీర్చడమే కాదు; రేపటి కోసమూ కేసీఆర్ ఏర్పాట్లు చేశారు. దామరచర్లలో అందుబాటులోకి రానున్న 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తుతో పాటు, మరో 4 వేల థర్మల్ కరెంటును, 6 వేల సోలార్ పవర్ ఉత్పత్తికి కూడా పునాది వేశారు. ఇదే జరిగితే దామరచర్ల రాష్ట్రంలో భారీ విద్యుత్తు కేంద్రంగా అవతరిస్తుంది.
నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఎలా సాధ్యమైంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి విద్యుత్తు విషయంలో ఉన్న దుర్భర పరిస్థితులను ఇంత వేగంగా ఎలా అధిగమించింది? అనతి కాలంలోనే దేశంలో 24 గంటల నిరంతరాయ విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా తీర్చిదిద్దగలిగారు? ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, పాలకులను తొలుస్తున్న ప్రశ్నలివే. నిజమే.. కరెంటు కరువుతో కటకటలాడిన తెలంగాణ.. ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాలకు 24 గంటల కరెంటు అందించే స్థాయికి అంత తేలికగా ఏమీ చేరుకోలేదు. అనితర సాధ్యమైన ఈ విజయం వెనుక ఓ విజనరీ ఉన్నారు. ఆయనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. కేసీఆర్ నిరంతర మేధోమథనం నుంచి పుట్టుకొచ్చిన ప్రణాళికలు.. వాటిని పకడ్బందీగా అమలుచేయగల యంత్రాంగాన్ని క్రమపద్ధతిలో పేర్చటం.. నిరంతర పర్యవేక్షణతోనే ఈ విజయం సాధ్యమైంది. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ అవసరాలేమిటో తెలిసిన నాయకుడు కాబట్టే.. అధికారం చేపట్టగానే సీఎం తన మదిలోని ప్రణాళికలకు వాస్తవరూపం ఇచ్చారు. వాటి ఫలితాలు రాష్ట్రంతోపాటు దేశం కూడా ఇప్పుడు ఆస్వాదిస్తున్నది. ఈ విద్యుత్తు విజయాన్ని సుస్థిరం చేసేందుకు నల్లగొండ జిల్లా దామరచర్లలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అతిపెద్ద థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మిస్తున్నది. సీఎం కేసీఆర్ సోమవారం ఆ కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్తు విజయంపై ప్రత్యేక కథనం.
పట్టుబట్టి సాధించి..
ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన తెలంగాణకు నాయకత్వం వహించిన నేతగా కేసీఆర్.. తెలంగాణకు ఏమేం కావాలనేదానిపై అప్పటి యూపీఏ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో స్పష్టంగా చెప్పారు. ఉద్యమ సమయంలోనే అనేక అంశాలపై పక్కా ప్రణాళికలు రచించారు. కేంద్రంతో నాడు చర్చకు వచ్చిన ప్రధాన సమస్యల్లో ఒకటి రాజధాని అంశంకాగా, రెండోది విద్యుత్తు. కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తే ఏయే పదువులు వస్తాయన్న ఆలోచనల్లో మునిగి తేలుతుండగా.. కేసీఆర్ మాత్రం తెలంగాణకు అత్యధిక ప్రయోజనం కలిగించేలా కేంద్రంతో ఏయే అంశాలపై మాట్లాడలనేదానిపైనే దృష్టి పెట్టారు. విద్యుత్తు విషయంలో ఎంతో దూరదృష్టితో వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఇటు గోదావరి, అటు కృష్ణా నదుల కంటే ఎత్తులో ఉండటంవల్ల ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. తెలంగాణలో వ్యవసాయానికి బావులు, బోరు బావులే ఆధారమైనందున విద్యుత్తు అత్యంత కీలకమని కేంద్ర పాలకులకు అర్ధమయ్యేలా చెప్పారు. విద్యుత్తు విభజన విషయంలో తెలంగాణకు అధికభాగం ఇవ్వాల్సి ఉంటుందని వాదించారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర పాలకులు తెలంగాణకు విద్యుత్తు ఇవ్వబోరని నాడే గుర్తించి కేంద్రానికి అర్ధమయ్యేలా చెప్పారు. సీమాధ్రంలో అప్పటికే అనేక ప్రాజెక్టులు పూర్తయ్యి కాలువల ద్వారా విస్తృతంగా వ్యవసాయం చేస్తుండటాన్ని కూడా సోదాహరణంగా వివరించడంతోనే కేంద్రం మిన్నకుండిపోయింది. అప్పటికే ఉన్న విద్యుత్తులో 53.89 శాతం తెలంగాణకు, 46.11 శాతం ఏపీకి పంపిణీ చేసేలా కేంద్రాన్ని ఒప్పించారు. ఇది విద్యుత్తు విషయంలో కేసీఆర్ సాధించిన మొట్టమొదటి విజయంగా చెప్పవచ్చు. 400 మెగావాట్ల సామర్థ్యంగల సీలేరు జల విద్యుత్తు కేంద్రాన్ని కూడా తెలంగాణకే కేటాయించేలా చేయడంలోనూ సఫలీకృతులయ్యారు. దీనితోపాటు తెలంగాణకే ప్రత్యేకంగా ఒక థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు కావాలని కేంద్రాన్ని కోరారు. ఈ మూడు అంశాల్లోనూ తెలంగాణకు అత్యధిక లాభం కలిగేలా కేసీఆర్ పట్టుబట్టి సాధించారు.
నాలుగింతల ఫలితం
2014లో 7778 మెగావాట్లున్న తెలంగాణ స్థాపిత విద్యుత్తు సామర్థ్యం… 2022 మార్చి నాటికి 17,226 మెగావాట్లకు పెరిగింది.
త్వరలో అది 25,018 మెగావాట్లకు చేరనున్నది.
2014తో పోలిస్తే 8 ఏండ్లలో విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం దాదాపు నాలుగింతలైంది.
1. విభజన చట్టంతో గరిష్ఠ స్థాయిలో ప్రయోజనం సాధించడం
2. రాష్ట్ర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని పెంచడం
3. సరఫరా, పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేయడం
4. నేషనల్ గ్రిడ్తో తెలంగాణను కనెక్ట్ చేయడం
5. మనకు అవసరమున్నప్పుడు తీసుకుని, అక్కర్లేనప్పుడు ఇచ్చేలా ఇతర రాష్ర్టాలతో ఒప్పందాలు
6. విద్యుత్తు సరఫరాలో కీలకమైన ఉద్యోగుల సంక్షేమానికి బాధ్యత తీసుకోవడం.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు
ఎన్టీపీసీ ప్లాంట్
కేంద్రంతో చర్చల సందర్భంగా తెలంగాణకు ప్రత్యేక థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు కావాలని కేసీఆర్ కోరడంతో కేంద్రం అంగీకరించింది. వెంటనే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఛైర్మన్ను పిలిపించి చర్చించింది. 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని రామగుండంలోనే నిర్మించేలా ప్రణాళిక వేశారు. కేంద్రం డెడికేటెడ్గా ఈ ప్లాంట్ను నిర్మించి ఇవ్వాలి. దీని నుంచి అత్యధికంగా తెలంగాణకే విద్యుత్తు వచ్చేలా ఒప్పందం కుదిరింది. 4000 మెగావాట్లలో 15 శాతం (600 మెగావాట్లు) మాత్రమే సెంట్రల్ ఫూల్లోకి.. మిగతా 85 శాతం (3400 మెగావాట్లు) తెలంగాణకు ఇచ్చేలా కేసీఆర్ ఒప్పందం చేయగలిగారు. 15 శాతం ఉన్న సెంట్రల్ ఫూల్ నుంచి కూడా తెలంగాణ విద్యుత్తును తీసుకొనే అవకాశం ఉండటంతో.. దాదాపు 100 శాతం తెలంగాణకే వచ్చినట్టుగా చెప్పవచ్చు.
పురిట్లోనే మోదీ దెబ్బ
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో తెలంగాణకు బద్ధ విరోధి అయిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. ఇదే సమయంలో కేంద్రంలోనూ నరేంద్రమోదీ అధికారం చేపట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతో తెలంగాణను తొలిదెబ్బ తీశారు. తన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే 400 మెగావాట్ల సీలేరు జల విద్యుత్తు కేంద్రంతోపాటు, 7 మండలాలను తెలంగాణ నుంచి విడదీసి ఏపీలో కలుపుతూ నిర్ణయం తీసుకొన్నారు. మోదీ చారిత్రక తప్పిదంతో తెలంగాణకు చారిత్రక నష్టం జరిగింది. కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ఉద్యమానికి పిలుపునిచ్చారు.
ఫాసిస్టు ప్రధాని, తెలంగాణ ద్రోహి అంటూ తెలంగాణ సమాజం భారీ ఎత్తున ఆందోళన నిర్వహించింది. 365 రోజులపాటు విద్యుత్తును అందించే సీలేరు జల విద్యుత్తు కేంద్రం నుంచి తక్కువ ఖర్చుతో తెలంగాణకు విద్యుత్తు లభించేది. దానిని ఏపీలో కలపడంతో మనకు భారీ నష్టం సంభవించింది. ఇదిలా ఉండగా.. రామగుండంలో నిర్మించాల్సిన 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం విషయంలో ఎన్టీపీసీ అడ్డదిడ్డంగా వ్యవహరించింది. ప్రాజెక్టును ఒకేసారి పూర్తిచేయలేమని, రెండు విడతలుగా చేపడుతామని ప్రకటించింది. మొదటి ఫేజ్లో 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు.. రెండో ఫేజ్లో 800 మెగావాట్ల సామర్థ్యంలో మరో మూడు యూనిట్లను ఏర్పాటు చేస్తామని చల్లగా చెప్పుకొచ్చింది. దీనితో విద్యుత్తు విషయంలో మన కాళ్లపై మనం నిలబడలేకపోతే కష్టాలు తప్పవని సీఎం కేసీఆర్ గుర్తించారు.
సొంతంగానే థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం
కేంద్రం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల తీరుతో విసిగిపోయిన సీఎం కేసీఆర్.. విద్యుత్తు విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని కృత నిశ్చయానికి వచ్చారు. ఇతర రాష్ర్టాలకు కూడా విద్యుత్తును ఇవ్వగలిగే స్థాయికి చేరుకొంటేనే బంగారు తెలంగాణ సాధ్యమని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్తగా థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మించడంతోపాటు.. అప్పటికే ఉన్న చిన్న విద్యుత్తు కేంద్రాల సామర్థ్యాన్ని పెంచేలా ప్రణాళికలు వేశారు. ఇందులో భాగంగా 4,000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ స్టేషన్, 1,080 భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ విద్యుత్తు కేంద్రం, 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రం, 800 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్తు మూడో ప్లాంటు నిర్మాణం చేపట్టారు. వీటితోపాటు 120 మెగావాట్ల పులిచింతల, 240 మెగావాట్ల లోయర్ జూరాల జల విద్యుత్తు కేంద్రాల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. ఇదే సమయంలో సీఎం సోలార్ పవర్ ఉత్పత్తిపై దృష్టిపెట్టారు. దాదాపు 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకొన్నారు. దీనికి తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న 7,778 మెగావాట్లను కలిపితే సుమారు 25,018 మెగావాట్లకుపైగా విద్యుత్తు స్థాపిత సామర్థ్యాన్ని రాష్ట్రం సాధించింది. వీటికి తోడు భవిష్యత్తు అవసరాల కోసం దామరచర్లలో మరో 4 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంటును రాష్ట్రప్రభుత్వం సొంతంగా నిర్మిస్తున్నది. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరో 4,000 మెగావాట్లకు పెంచుకొనే వనరులు ఉన్నాయి.
ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థల బలోపేతం ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఈ ప్రాంతంలో విద్యుత్తు ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు అస్తవ్యస్థంగా ఉన్నాయి. సరఫరాలో తీవ్ర అసమతుల్యం ఉండేది. దీంతో కరెంటు లో ఓల్టేజీ సర్వసాధారణంగా మారింది. కరెంటు రాదు.. వచ్చినా నిలవదు అనేలా పరిస్థితి ఉండేది. మోటర్లు కాలిపోవుడు, రైతులు అరిగోస పడుడు నిత్యకృత్యం. దీంతో ముందుగా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను మెరుగుపరచాలని సీఎం నిర్ణయించారు. దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చుచేసి 33 కేవీ నుంచి 400 కేవీ సామర్థ్యమున్న స్టేషన్లు అనేకం నిర్మించారు. వేల కిలోమీటర్ల మేర లైన్లను మార్చి కొత్తగా వేశారు. నాలుగు వైపుల నుంచి విద్యుత్తు ట్రాన్స్మిషన్ జరిగేలా ఏర్పాట్లు చేశారు.
అనేక అడ్డంకులు
ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్లాంట్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. తెలంగాణ విరోధుల కారణంగా కోర్టు కేసులు వెంటాడాయి. కరోనా సైతం పనులకు అటంకం కలిగించింది. ఈ ప్రాజెక్టుకు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ), పవర్ పైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) కలిసి పూర్తిస్థాయిలో రుణం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. పనులు సక్రమంగా జరుగుతుండగా, పలు కారణాలతో ఈ సంస్థలు నిధుల విడుదల నిలిపివేశాయి.
అత్యంత నమ్మకంగా పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ సైతం పనులు సకాలంలో చేపట్టలేదు. ఇక నిర్మాణ దశలో ఉండగానే ముంబైకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు మేరకు ఈ ప్లాంట్ నిర్మాణంపై 9 నెలల్లో అధ్యయనం చేయాలంటూ చెన్నైలోని గ్రీన్ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. అన్ని రకాల పర్యావరణ అనుమతులు లభించిన తర్వాత కూడా మరోసారి రేడియేషన్ ప్రభావం, యాష్పాండ్ డిజైన్, ప్లాంట్కు 25 కిలోమీటర్ల పరిధిలో గాలి నాణ్యత, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు దూరం వంటి అంశాలపై ఎన్జీటీ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. 2017 జూన్ 29న కేంద్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతికశాఖ అన్ని రకాల అనుమతులిచ్చింది. అయితే, పనులు పూర్తిచేసినా అధ్యయనం పూర్తయ్యేవరకు భారీ యంత్రాలు అమర్చవద్దని, ఉత్పత్తి చేయవద్దంటూ ఎన్జీటీ మెలికపెట్టింది. ఇన్ని అడ్డంకులను అధిగమిస్తూ ప్లాంటును నిర్మించటం వెనుక సీఎం కేసీఆర్ కృషి, ప్రణాళిక, పట్టుదల, అధికారుల నియామకం, మార్గదర్శనం, సహకారం వెలకట్టలేనివి.
గ్రిడ్తో అనుసంధానం..
నిజానికి రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణకు నేషనల్ గ్రిడ్ (పీజీసీఐఎల్)తో సంబంధం లేదు.. సభ్యత్వం లేదు. దీనిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వార్ధా-డిచ్పల్లి, వరంగల్-వరోరా, అంగూల్-పలాస లైన్లను త్వరితంగా ఏర్పాటుచేసేలా చూసి.. గ్రిడ్తో రాష్ర్టాన్ని అనుసంధానించేలా చూశారు. దీనితో రాష్ట్ర అవసరాల మేరకు ఇతర రాష్ర్టాల్లోని విద్యుత్తు సంస్థల నుంచి కావాల్సిన విద్యుత్తును అందిపుచ్చుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చారు. అదే పీజీసీఐఎల్ ద్వారానే మన అవసరాలకు ఛత్తీస్గఢ్ నుంచి 100 మెగావాట్ల విద్యుత్తును తీసుకునే వెసులుబాటు కలిగింది. మన అవసరాలను తీర్చడం వెనుక గ్రిడ్తో అనుసంధానించడమనేదే కీలకమైన అంశంగా చెప్పవచ్చు.
తెలంగాణకు గుండెకాయ దామరచర్ల ప్లాంటు
నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ప్లాంట్ను తెలంగాణకు గుండెకాయ లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ సింగరేణి బొగ్గుతోపాటు.. అవసరం ఏర్పడితే కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వారా విదేశీ బొగ్గును కూడా త్వరితంగా దిగుమతి చేసుకొనేలా రైల్వే ట్రాక్ ఉన్నాయి. భవిష్యత్తులో అవసరం ఏర్పడితే మరో 4,000 మెగావాట్ల ప్లాంటును కూడా నిర్మించడానికి వీలుగా అన్ని అనుకూలతలు ఉన్నాయి. దీనికి అదనగా అక్కడే మరో 5 నుంచి 6 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేశారు.
రాజస్థాన్తో ఒప్పందం..
గడిచిన ఎనిమిదిన్నరేండ్లుగా విద్యుత్తు రంగంలో అనేక రికార్డులు నెలకొల్పిన తెలంగాణ.. దేశంలో ఎవరికీ సాధ్యపడని విధంగా వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ పూర్తి ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. అలాగే మన దగ్గరి మిగులు విద్యుత్తును అందించేందుకు, అవసరమైనప్పుడు తీసుకునేందుకు వీలుగా రాజస్థాన్ విద్యుత్తు సంస్థలతో తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసుకున్న ఒప్పందం చాలా కీలకమైనది. భౌగోళికంగా తెలంగాణతో పోల్చితే.. రాజస్థాన్లో పంటకాలం ఒక నెల నుంచి ఒకటిన్నర నెలల తేడా ఉంటుంది. ఇదే అంశాన్ని ఆలోచించిన సీఎం.. రాజస్థాన్తో ఒప్పందం చేసుకునేలా సూచించారు. రాజస్థాన్కు అవసరం ఉన్నప్పుడు మనం విద్యుత్తును ఇస్తుంటాం. అలాగే మన వానకాలం సాగుకు మొదట్లో కావాల్సిన విద్యుత్తును రాజస్థాన్ నుంచి తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల కీలకమైన పంటల సమయంలో విద్యుత్తును అందుబాటులోకి తీసుకొచ్చేలా వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం.
సీఎండీగా ప్రభాకర్రావు..
ప్రణాళిక, వ్యూహం, మార్గదర్శకత్వం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో దానిని అమలు చేసే అనుభవం, శక్తిసామర్థ్యాలున్న అధికారి కావాలి అనే ఆలోచనతో.. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్రావును నియమించారు. ఆయనకు అటు ఉత్పత్తి, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్పై సంపూర్ణ అవగాహన ఉండటంతోపాటు ఇటు విద్యుత్తు సంస్థల ఆదాయ వ్యయాలపై పూర్తి పట్టు ఉన్నది. తెలంగాణలో 24 గంటల విద్యుత్తును నిరంతరాయంగా ఇచ్చేందుకు ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసే అనుభవం దేవులపల్లి ప్రభాకర్రావుకు ఉంది. అత్యంత కీలకమైన ఆర్థిక విభాగానికి డైరెక్టర్గా, ఒకప్పటి సమైక్య రాష్ట్రంలో విద్యుత్తు సంస్థకు ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అనుభవమున్న ప్రభాకర్రావును ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా అందుకే సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సమావేశం విద్యుత్తు అంశంపై జరుగగా, ఇచ్చిన తొలి ఉత్తర్వు ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్రావును నియమించడం.
డైరెక్టర్లు.. సిబ్బంది..
ఇదే సమయంలో డిస్కంలకు డైరెక్టర్లుగా ఎవరిని నియమించాలనే పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే.. తెలంగాణ విద్యుత్తు ఇంజనీర్లకు, ఉద్యోగులకు సీఈ స్థాయికి రాకుండా సీమాంధ్ర ఉద్యోగులు, యాజమాన్యాలు అడ్డుకునేవారు. దీంతో తెలంగాణ ఉద్యోగుల్లో డైరెక్టర్లుగా అర్హులైనవారు లేకుండా పోయారు. ఒకవేళ సీఈ స్థాయిలో ఉంటే.. ఏదో ఒక కారణంతో మెమో ఇచ్చేవారు. దీంతో సదరు సీఈ డైరెక్టర్ పదవికి అనర్హులయ్యేవారు. దీంతో డిస్కమ్లకు డైరెక్టర్లు దొరకని పరిస్థితి. గమనించిన సీఎం కేసీఆర్ అడ్డుగా ఉన్న ఆ నిబంధనలను మార్చేశారు. ఎస్ఈ స్థాయి అధికారులు కూడా డిస్కంలకు డైరెక్టర్లుగా వెళ్లేందుకు అర్హులయ్యేలా నిబంధనల్లో మార్పులు చేశారు. ఇక క్షేత్రస్థాయిలో ప్రణాళికలను అమలు చేసేందుకు వీలుగా సుమారు 28వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను, ఇతరులను రెగ్యులరైజ్ చేశారు. దీనితో క్షేత్రస్థాయిలో సీఎం అలోచనలు త్వరితంగా అమలయ్యాయి.
నేడు దామరచర్లకు సీఎం కేసీఆర్
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు పనుల పురోగతి పరిశీలన
హైదరాబాద్/దామరచర్ల, నవంబర్ 27: దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ప్లాంటు నిర్మాణపనుల పురోగతి పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి దామరచర్ల పర్యటనకు బయల్దేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు. అనంతరం థర్మల్ పవర్ స్టేషన్లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సీఎం పరిశీలిస్తారు. రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే 5 యూనిట్లను పరిశీలిస్తారు. ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్లోగా మొదటి యూనిట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక టీఎస్ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సీఎం సమావేశమై అక్కడ జరుగుతున్న పనులపై సలహాలు, సూచనలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, పర్యటనలో సీఎం కేసీఆర్తో పాటు జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. వీరు రెండు హెలికాప్టర్లలో ప్లాంటుకు వస్తున్నారని సమాచారం అందడంతో, ప్లాంటులో రెండు హెలిప్యాడ్లను అధికారులు సిద్ధం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆర్డీవో చెన్నయ్య, జెన్కో డైరెక్టర్ అజయ్, సీఈ సమ్మయ్య, డీఎస్పీ వెంకటేశ్వర్రావు తదితరులు ఆదివారం ఏర్పాట్లు పర్యవేక్షించారు.