హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, స్పష్టమైన మ్యానిఫెస్టోతో ప్రజా క్షేత్రంలో విస్తృత ప్రచారం చేస్తున్నది. స్వయంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) కదనరంగంలోకి దిగారు. ఇప్పటికే సగం తెలంగాణను చుట్టేశారు. తన ప్రసంగాలతో అభ్యర్థులకు గెలుపుపై ధీమా ఇస్తూ గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు అంపూర్లో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కొల్లాపూర్లో, 3 గంటలకు నాగర్కర్నూల్, సాయంత్రం 4 గంటలకు కల్వకుర్తిలో జరిగే సభలకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గ కేంద్రాలు ఇప్పటికే గులాబీ మయమయ్యాయి. సభా వేదిక చుట్టూ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రహదారులన్నీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి.