తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చినజీయర్ స్వామితో భేటీ కానున్నారు. దీనికోసం ఆయన ఆదివారం సాయంత్రం ముచ్చింతల్ వెళ్లనున్నారు. అక్కడే చినజీయర్ స్వామిని కలుస్తారు. ఆయనతో యాదాద్రి పునఃప్రారంభ ఏర్పాట్ల గురించి సీఎం చర్చిస్తారని తెలుస్తోంది.
మహాకుంభ సంప్రోక్షన గురించి సీఎం చర్చిస్తారు. అదే విధంగా మహా సుదర్శనయాగం ఏర్పాట్ల గురించి కూడా ఈ సమావేశంలో మాట్లడనున్నారని సమాచారం. యాదాద్రి ఆలయ పునఃప్రారంభం, అలాగే రామానుజాచార్యలు విగ్రహావిష్కరణ గురించి కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.
యాదాద్రి ఆలయ పనులు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే నెలలో ఆలయ పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుందని సీఎం ఇది వరకే ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి 8 రోజుల ముందే 1008 కుండలతో మహా సుదర్శనయాగం నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన వివరాలు చర్చించేందుకే సీఎం కేసీఆర్.. ముచ్చింతల్ వెళ్తున్నారు.