తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకొనేలా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయడమే దళితబంధు పథకం లక్ష్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే రూ.10 లక్షలు దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర
ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వగలదని స్పష్టం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల పరిధిలో దళితబంధును ముందుగా ప్రకటించిన విధంగానే సంతృప్త స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. ఇందుకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వంద మంది లబ్ధిదారులను ఎంపికచేసి అమలుచేసే కార్యాచరణను ప్రారంభించాలని కలెక్టర్లను, అధికారులను సీఎం ఆదేశించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలని చెప్పారు.