BRS Public Meeting | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ నియోజకవర్గం లోహా పట్టణంలో 26న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బైల్ బజార్లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ముస్తాబవుతున్నది. ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు, భారీ హోర్డింగులతో ముస్తాబు చేస్తున్నారు. బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్రావు కదం, కంధార్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో కాంగ్రెస్, బీజేపీ, శివసేన కాకుండా మరే పార్టీ కూడా ఈ స్థాయిలో సభను నిర్వహించలేదు. దీంతో సభా ఏర్పాట్లను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
బీఆర్ఎస్ నేతలు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే మరోవైపు తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో కలియ తిరుగుతున్నారు. పర్భణి, లాతూర్, నాందేడ్ లోక్సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఊరూరా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కంధార్, లోహా, కన్నాడ్, డెగులూర్, పూర్ణా, గంగాఖేడ్, ముద్ఖేడ్, పత్రి, పాలా, చందోలి, చౌక్, మన్వర్, అహ్మదాపూర్, ధర్మాబాద్, బిలోలితోపాటు ఇతర నియోజకవర్గాలు, తాలూకాలను చుట్టివస్తూ.. అక్కడివారితో ముచ్చటిస్తున్నారు. తెలంగాణ పథకాలు, అభివృద్ధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 26న నిర్వహించే సభకు భారీగా తరలిరావాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్పార్టీ శ్రేణులకు గ్రామగ్రామాన ప్రజలు నీరాజనం పలుకుతున్నారు.
లోహా సభ ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకొన్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. కంధార్ లోహా పట్టణవాసులతోపాటు పర్భణి, లాతూర్, నాందేడ్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల ప్రజలు తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధితో తమ అభివృద్ధిని పోల్చి చూసుకొంటున్నారని, అనతికాలంలోనే కేసీఆర్ పాలనలో తెలంగాణలో అన్ని రంగాల్లో వచ్చిన మార్పులను చూస్తూ ఆశ్చర్యపడుతున్నారని వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పింఛన్లు, రైతు బంధు, రైతు బీమాలాంటి పథకాలు తమకూ కావాలని ఇక్కడి ప్రజలు కోరుకొంటున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్కు మరాఠా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు.