నాందేడ్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రం గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఏర్పాటు అనంతరం రాష్ట్రం వెలుపల మొట్టమొదటి సారిగా నిర్వహించతలపెట్టిన సభకు సర్వం సిద్ధమైంది. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో సభా వేదిక అందంగా ముస్తాబైంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, నలు దిశలా, ఎయిర్పోర్ట్ నుంచి సభా వేదిక వరకు దారిపోడవునా గులాబీ తోరణాలు, కేసీఆర్ చిత్రపటాలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాందేడ్ పట్టణంలోనే దాదాపు 40 వేల మందికిపైగా తెలుగువారు ఉన్నారు. వారంతా కేసీఆర్ కేసీఆర్ రాక కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇక సభా వేదికతోపాటు, పార్కింగ్, మీడియా గ్యాలరీలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. దాదాపు 25 వేల మందికిపైగా కూర్చునేందుకు వీలుగా టెంట్ను వేశారు.
సభపై సర్వత్రా ఉత్కంఠ
రాష్ట్రం వెలుపల సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్లోకి నాందేడ్ జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్లు, యువకులు చేరగా నేడు కూడా భారీ సంఖ్యలో చేరికలుండబోతున్నాయి. అందులో బీజేపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలకనేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మాజీ ఎంపీలతో సహా సరిహద్దు గ్రామాలకు చెందిన దాదాపు 40 గ్రామాలకు పైగా సర్పంచ్లు బీఆర్ఎస్లో చేరే అవకాశముందని స్థానిక నాయకులు చెప్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు నాందేడ్కు చెందిన నాయకులతోపాటు, సభ నిర్వహణ ఏర్పాట్లను ఆది నుంచి పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ తదితరులు భారీగా ఏర్పాట్లు చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ బీబీ పాటిల్తోపాటు పలువురు నాయకులు సైతం నాందేడ్కు తరలివస్తున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్
తెలంగాణ తరహా అభివృద్ధి కోరుకుంటున్నారు
నాందేడ్ పట్టణవాసులతోపాటు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధితో తమ అభివృద్ధిని పోల్చిచూసుకుంటున్నారు. అనతికాలంలోనే కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణలో వచ్చిన మార్పులను చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమకూ తెలంగాణ తరహాలో పింఛన్లు, రైతుబంధు, బీమా పథకాలు కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్కు నాందేడ్లో అనూహ్య స్పందన లభిస్తున్నది. సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు, కేసీఆర్ మాట వినేందుకు ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
– ఎమ్మెల్యే బాల్క సుమన్
సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి
సభ ఏర్పాట్లు రేపటికల్లా పూర్తవుతాయి. నాందేడ్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై ఊహించనిరీతిలో విశేష స్పందన లభిస్తున్నది. సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణ పథకాలను వివరిస్తూ, ఆ తరహా పాలన తమకూ కావాలని కోరుతున్నారు. అందుకోసం బీఆర్ఎస్ వెంట నడుస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. సభ రోజున ఊహించని రీతిలో భారీగా చేరికలు ఉంటాయి.
– మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి