సీఎం హోదాలో మూడోసారి బ్రహ్మోత్సవాలకు
మహాకుంభ సంప్రోక్షణ పనులపై సమీక్ష!
యాదాద్రి, మార్చి10: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సతీసమేతంగా హాజరుకానున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే స్వామివారి తిరుకల్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. దాదాపు 2 గంటలపాటు జరిగే వేడుకను వీక్షిస్తారు. ఉదయం ప్రగతిభవన్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి యాదాద్రి హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. కొండపైకి చేరుకొని యాదాద్రి బాలాలయంలో నిర్వహిస్తున్న బ్రహోత్సవాల్లో పాల్గొంటారు. సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కల్యాణానంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో భోజనం చేసి విరామం తర్వాత, మహాకుంభ సంప్రోక్షణ పనులపై అధికారులతో సమీక్ష చేపట్టనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
మూడోసారి తిరుకల్యాణానికి సీఎం దంపతులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే తిరుకల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి పాల్గొననున్నారు. 2015 ఫిబ్రవరి 27న ఒకసారి, 2016 మార్చి 17న జరిగిన స్వామివారి తిరు కల్యాణమహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా బాలాలయంలో కవచమూర్తులను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రధానాలయం సిద్ధం కావటంతో బాలాలయంలో చివరిసారి జరుగనున్న బ్రహ్మోత్సవాలకు సీఎం హాజరుకానున్నారు. ఇందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
పనులపై అధికారులతో సమీక్ష!
ఈ నెల 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణలో భాగం గా.. పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టే అవకాశాలున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 21న ప్రారంభం కానున్న మహా సుదర్శన యాగం, వారంపాటు సాగే వివిధ రకాలు హోమా లు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతోపాటు యాదాద్రికి వచ్చే భక్తులకు వసతుల కల్పనపై సీఎం సమీక్ష జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా బంగారు తాపడం పనులు, కలశ స్థాపన, మహాకుంభ సంప్రోక్షణ పూజల విధివిధానాలపై సమీక్షించనున్నట్టు తెలుస్తున్నది.