హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు దశకు చేరాయి. సోమవారం ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు వైభోవోపేతంగా జరుగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముగింపు వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరుకానున్నారు. పలువురు జాతీయ, అంతర్జాతీయ కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
అలాగే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధుల వారసులను, ఇటీవల పలు అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించిన తెలంగాణ క్రీడాకారులతో పాటు ప్రముఖులను సన్మానించనున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. స్వతంత్ర భారత చరిత్రలో నిలిచిపోయే విధంగా దాదాపు మూడు గంటల పాటు అట్టహాసంగా, అంగరంగ వైభవంగా ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ మ్యూజికల్ కాన్సర్ట్, డ్రమ్స్ శివమణి ప్రదర్శన, పద్మశ్రీ పద్మజ రెడ్డి బృందంచే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సీ బ్రదర్స్ ఖవ్వాలితో పాటు స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
అలాగే వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియోను ప్రదర్శిస్తారు. అనంతరం లేజర్ షోతో పాటు భారీ ఎత్తున బాణాసంచ ప్రదర్శనలతో వజ్రోత్సవాలు ముగియనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 30వేల మంది ముగింపు ఉత్సవాల్లో పాల్గొనే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బల్దియా మేయర్లు, చైర్మన్లు, డీసీసబీ చైర్మన్లు, ఆలయ ట్రస్టు బోర్డుల చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొననుండగా.. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.