పెద్దపల్లి, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పెద్దపల్లికి రానున్నారు. ఇందుకోసం అధికార యంత్రాం గం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపల్లికి చేరుకొంటారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, గౌరెడ్డిపేట శివారులో పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో నిర్మించిన పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత కలెక్టరేట్ సమీపంలోని పెద్దకల్వలలో 50 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
లక్షమంది సభకు రానున్నందున అందుకనుగుణంగా ఏర్పాట్లు చేశారు. వేదికను అందంగా ముస్తాబు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం 132 ఎకరాలు కేటాయించారు. ఆదివారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీలు టీ భానుప్రసాదరావు, ఎల్ రమణ తదితరులు సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు.