హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలు, ప్రజా ఆశీర్వాద సభలు శనివారంతో 60కి చేరాయి. గత నెల 15 నుంచి మొదలైన సభలు రెండు విడతలుగా సాగి నవంబర్ 18 నాటికి 33 రోజులపాటు (సభలు నిర్వహించింది 23 రోజులే) 60 సభలు దిగ్విజయంగా కొనసాగాయి. ఇంకా 10 రోజులపాటు మిగిలిన 59 నియోజకవర్గ ప్రజలను సీఎం కేసీఆర్ కలుసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 28న వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, గజ్వేల్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలతో ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ముగించనున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జనప్రవాహంతో విజయోత్సవ సభలను తలపించాయి. సభా ప్రాంగణాలు లక్షలాదిగా తరలివచ్చిన జనంతో కిక్కిరిసిపోయాయి.
పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిన అభివృద్ధి గురించి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతీ సభలో గత ప్రభుత్వాలకు, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు తేడాలను విడమరిచి చెప్తున్నారు. సీఎం సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కేసీఆర్ ప్రసంగాలను ఆసక్తిగా వింటున్నారు. రైతుల కోసం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటలు ఉచిత విద్యుత్తు వంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపై సభల్లో సీఎం చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నది. గతంలో ఎన్నడూ ఇలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు తేల్చి చెప్తున్నారు. గతంలో ఏ పాలకులైనా బీఆర్ఎస్ పాలనలో ఇచ్చినట్టు వేలల్లో పెన్షన్ ఇచ్చారా? అని కేసీఆర్ ప్రశ్నిస్తే, ప్రజల నుంచి ‘లేదు.. లేదు’ అంటూ విశేష స్పందన వస్తున్నది.
3 గంటల కరెంట్ చాలు అని రేవంత్, తమ రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే చేస్తున్న వాదనను కేసీఆర్ సభల్లో ప్రజలకు వివరిస్తున్నప్పుడు కాంగ్రెస్ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 గంటల కరెంటు కావాలా? 24 గంటలు కరెంటు కావాలా? అని కేసీఆర్ ప్రశ్నించగానే రైతులు తమకు 24 గంటల కరెంటు కావాలంటూ చేతులెత్తి ప్రకటిస్తున్నారు. ధరణి ఉండాలా? వద్దా? అని ప్రజలను సీఎం అడుగుతుంటే ఉండాలంటూ ముక్తకంఠంతో ఆమోదం తెలుపుతున్నారు. కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు ఆలోచింపచేస్తున్నాయి.
23 రోజుల్లో 60 ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలను కలిసిన సీఎం కేసీఆర్, మరో 10 రోజుల్లో 59 నియోజకవర్గాల ప్రజలను కలుసుకోనున్నారు. ఆదివారం నుంచి 24 దాకా ప్రతిరోజు నాలుగు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. 25న జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల సభ తరువాత 26, 27 తేదీల్లో నాలుగేసి నియోజకవర్గాల్లో నాలుగు సభల చొప్పున నిర్వహిస్తారు. 28న మూడు నియోజకవర్గాల ప్రజల ఆశీర్వాదాన్ని కోరనున్నారు. మొత్తంగా గత నెల 15న ప్రారంభమైన ప్రజా ఆశీర్వాద సభలు ఈ నెల 28న గజ్వేల్ నియోజకవర్గంతో ముగియనున్నది.