రజక సంఘాల సమితి
హైదరాబాద్, జూలై6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్లనే రజకులు అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్నారని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ కుమారస్వామి కొనియాడారు. బుధవారం నగరంలోని మేడిపల్లిలో నిర్వహించిన తెలంగాణ రజక సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా హైదరాబాద్ కేంద్రం మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో 3 ఎకరాల స్థలంలో రజకుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ కేటాయించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.
అందుకు సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సమితి చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వివిధ రజక సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కొండూరు సత్యనారాయణ, పంజగారి ఆంజనేయులు, కొన్నె సంపత్, దుర్శెట్టి చంద్రమౌళి, గోపి రజక, మొగ్గ అనిల్కుమార్, చాపర్తి కుమార్గాడ్గే, మానస గణేశ్, రాష్ట్ర కన్వీనర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.