హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మహోన్నత కవి దాశరథి కృష్ణమాచార్య ఆశయ స్ఫూర్తితో తెలంగాణలో ప్రగతి పాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషల్లో పండితుడైన దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ దాశరథి సేవలను స్మరించుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన దాశరథి కృష్ణామాచార్యులు, తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ అని కొనియాడారు. సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో విశేష కృషి చేసి తెలుగు భాషా సాహిత్యాన్ని దాశరథి సుసంపన్నం చేశారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏటా దాశరథి కృష్ణామాచార్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడంతోపాటు తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కవులకు ఆయన పేరుతో పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నదని తెలిపారు. 2023 సంవత్సరానికి ఆయాచితం నటేశ్వరశర్మకు దాశరథి పురసారాన్ని ప్రదానం చేయనున్న విషయాన్ని గుర్తుచేశారు. దాశరథి ఆశయాల మేరకు ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడం, రాష్ట్ర ప్రగతిని కొనసాగించడంలోనూ వారి స్ఫూర్తి ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వంతో, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.