హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): దేశంలో మనుషులంతా సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించి, ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేసిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం ఫూలే 197వ జయంతిని పురస్కరించుకొని దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకొన్నారు. వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా.. దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జ్యోతిబా ఫూలే 200 ఏండ్ల క్రితమే ఉద్యమం చేపట్టారని తెలిపారు.
ఫూలే అనుసరించిన సామాజిక సమానత్వ పంథా, నాటి భారతీయ సమాజంలో కొనసాగుతున్న సాంప్రదాయ సామాజిక విలువలను, వ్యవస్థలను సమూలంగా మార్చివేసేందుకు బాటలు వేసిందని చెప్పారు. గుణాత్మక మార్పు దిశగా దేశంలోని స్త్రీలు, దళిత బహుజనులు ఉద్యమించేలా పూలే కార్యాచరణ పురికొల్పిందని వెల్లడించారు. మహాత్మా ఫూలేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ స్వయంగా గురువుగా ప్రకటించుకొన్నారని సీఎం గుర్తు చేశారు. జ్యోతిరావు ఫూలే ఆశయాలను నెరవేర్చేదిశగా తెలంగాణ ప్రభుత్వం తన ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకొని అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణను అమలు చేస్తున్నదని వివరించారు.
జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో ‘వికాసమే వివక్షకు విరుగుడు’ అనే విధానాన్ని అనుసరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం పాటుపడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేడు రాష్ట్రంలోని దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించి సామాజిక సమానత్వం దిశగా పురోగమిస్తున్నారని పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎకువశాతం బహుజన వర్గాలే లబ్ధిదారులుగా ఉన్నారని వెల్లడించారు. దళితబంధు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక ప్రగతి నిధి, అంబేదర్ ఓవర్సీస్ సాలర్షిప్స్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీలు, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పారిశ్రామికవేత్తలకు అండగా టీఎస్ ప్రైడ్, గిరిజనులకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.
బీసీల వికాసానికి మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి, బీసీ గురుకులాలు, గొర్రెల పంపిణీ, బెస్త, ముదిరాజుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకం, బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గీత, చేనేత, మత్స్య కార్మికులకు ప్రమాదబీమా, కల్లు దుకాణాల పునరుద్ధరణ, గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు, నేతన్నకు చేయూత, సెలూన్లకు ఉచిత విద్యుత్తు ద్వారా నాయీ బ్రాహ్మణులకు చేయూత, రజకులకు ఆధునిక లాండ్రీ యంత్రాలు, ధోబీఘాట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
మహిళలకు గురుకుల విద్యతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, బహుజనుల సమగ్ర వికాసానికి చేపడుతున్న కార్యక్రమాలు ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక ఆత్మగౌరవాలను ద్విగుణీకృతం చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి వెనుక మహాత్మా ఫూలే ఆదర్శాలు, ఆశయ సాధన లక్ష్యాలు ఇమిడి ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో సాధిస్తున్న విజయాలు దేశానికి ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో భారత సమాజంలో అన్ని రంగాల్లో అన్నివర్గాలకు సమానత్వం ఆవిషరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తన కార్యాచరణను కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.