తుర్కపల్లి, ఏప్రిల్ 25: గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారం పది రోజుల్లో పూర్తిచేసి బ్లూ ప్రింట్ తయారు చేయాలని, త్వరలోనే మళ్లీ గ్రామానికి వస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామ సర్పంచ్ ఆంజనేయులుకు సూచించారు. సోమవారం యాదాద్రిలో శివాలయం, మహాకుంభాభిషేకం, రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళ్తూ మార్గమధ్యంలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో రోడ్డుపై నిలుచున్న స్థానిక సర్పంచ్ పోగుల ఆంజనేయులును చూసి కాన్వాయి ఆపి తన పైలట్ వాహనంలో యాదాద్రికి తీసుకెళ్లారు.
రామలింగేశ్వరస్వామి ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం స్థానిక ప్రెసిడెన్షియల్ సూట్లో సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితోపాటు వాసాలమర్రి సర్పంచ్తో సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై చర్చించారు. గ్రామంలో ఇండ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నదని, ఎటుచూసినా పెంకుటిండ్లు, మట్టిగోడలే కన్పిస్తున్నాయని, వాటిని తొలగించి కొత్త గృహాలను సుందరంగా నిర్మించుకుందామని అన్నారు.
వారం పది రోజుల్లో అధికారులంతా కలిసి బ్లూ ప్రింట్ తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. అదేవిధంగా దళితబంధు పథకం యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వారి ఆర్థిక స్థితిగతుల గురించి సర్పంచ్ను అడిగి తెలుసుకున్నారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన దళితులు మళ్లీ గ్రామానికి తిరిగి వచ్చారని సర్పంచ్ తెలిపారు. అలాంటి కుటుంబాలు మరో 12 వరకు ఉంటాయని, వారికి కూడా దళితబంధు ఇప్పించాలని సర్పంచ్ కోరగా.. సీఎం కేసీఆర్ అందుకు అంగీకరించినట్టు సమాచారం.