హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రెండు ముఖ్యమైన వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఒకటి లింగ వివక్ష, రెండోది కుల వివక్ష అని తెలిపారు. లింగ వివక్ష వల్ల దేశ జనాభాలోని సగం జనాభా అయిన మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోవడం వల్ల నష్టం జరుగుతున్నది. అదే సందర్భంలో దేశ జనాభాలో 20 శాతం దళితులు కూడా కుల వివక్ష వల్ల దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. అటు మహిళా శక్తి, ఇటు దళిత శక్తి నిర్వీర్యం కావడం వల్ల అభివృద్ధి జరగట్లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సందర్భంలో పేదరికం పేరుతో అగ్రవర్ణాలని చెప్పబడే వారిలో కూడా ఎందరో అవకాశాలను కోల్పోతున్నరని పేర్కొన్నారు. ఇవన్నీ మారకుండా దేశంలో సమూల మార్పు జరగదు. స్థూలమైన విషయాల్లో మౌలిక మైన మార్పు రాకుండా సామాజిక పరిస్థితుల్లో మార్పు రావడం సాధ్యం కాదన్నారు. ఏ దేశాలైతే.. ఏ సమూహాలైతే.. తాము నిత్యం అనుసరిస్తున్న సాధారణ పని విధానం నుంచి బయటపడతాయో.., ఆ సమాజాన్ని వినూత్న పంథాలో నడిపిస్తాయో, అటువంటి దేశాలే గుణాత్మకంగా మారినయి. మార్పుకోరుకోని సమాజాలు మారలేదు. ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచిన సమాజాలే ఫలితాలు సాధించాయని కేసీఆర్ తెలిపారు.
1980 వరకు చైనా జిడిపి మన దేశం కన్నాతక్కువగా ఉండేది. 16 ట్రిలియన్ డాలర్ల ఎకనామితో చైనా నేడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. సౌత్ కొరియా, జపాన్, మలేసియా వంటి దేశాల్లో అద్భుతాలు జరిగాయి. నేడు దళిత బంధు అనేది ప్రత్యేకంగా దళిత జనోద్దరణకోసం అమలు చేస్తున్న కార్యక్రమం. సమాజంలోని ఇతరులకు అందే అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు దళితులకు కూడా అందుతున్నాయి. వాటితో పాటు దళిత బంధు పథకం వారికి అధికం. ఇది వారి అభివృద్ధి కోసమే అమలు చేస్తున్న ప్రత్యేక పథకం అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని 8 లక్షల 40 వేల కుటుంబాలకు దళిత బంధు, రైతుబంధు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని కేసీఆర్ గుర్తు చేశారు. ఇదే విషయాన్ని, ఇక్కడకు వచ్చిన ప్రముఖ దళిత నాయకులు ఎంపీ తిరువలన్ కు చెప్తే ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్రంలో 17 లక్షల 50 వేల దళిత కుటుంబాలున్నాయి. వారందరికీ దశల వారీగా దళిత బంధును అందిస్తూ బాగుచేసుకుంటూ ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.