CM KCR | సంగారెడ్డి : ఇండియా మొత్తంలో అత్యధిక శాలరీలు పొందుతున్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మొన్ననే పీఆర్పీ అపాయింట్ చేశాం. మళ్ల మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం.. డీఏలు కూడా బ్రహ్మాండంగా ఇచ్చుకుందామని కేసీఆర్ తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ రాష్ట్రంలో పేదలను, రైతులను, ప్రభుత్వ ఉద్యోగలను అందర్నీ సమదృష్టితో చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పాను ప్రభుత్వ ఉద్యోగస్తులకు, తెలంగాణ ధనిక రాష్ట్రం అయితది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా మీకు శాలరీలు వస్తాయని చెప్పాను. నేను రుజువు చేసి చూపెట్టాను. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి. ఇండియా మొత్తంలో ఉద్యోగస్తులకు హైయేస్ట్ శాలరీ ఇచ్చేది ఏదన్న ఉందంటే అది తెలంగాణ స్టేట్ మాత్రమే. మళ్ల మొన్న కూడా పీఆర్సీ అపాయింట్ చేశాం. మళ్ల కూడా మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం. బ్రహ్మాడంగా డీఏలు కూడా ఇచ్చుకుందాం అని కేసీఆర్ తెలిపారు.
వాటితో పాటు ఉద్యోగల సంక్షేమాన్ని చూశాం. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు కొంత మంది ఉన్నారు. చాలా మందిని రెగ్యులరైజ్ చేశాం. వాళ్లు పోను మిగతా ఎవరైతే ఉన్నారో పీఆర్సీ ఉద్యోగులకు 30 శాతం ఇస్తే, ఆ చిన్న ఉద్యోగుల కడుపు నింపాలని వాళ్లకు కూడా 30 శాతం జీతాలు పెంచినం. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు. ఎక్కడ జరగదు. ఆర్టీసీ ఉద్యోగులు మా ఉద్యోగాలు పోతాయని దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు ఉండేవారు. వాళ్లు ఫైట్ చేశారు. మొన్ననే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. గవర్నర్ లేట్ చేయడం వల్ల ఆలస్యమైంది. గవర్నమెంట్ వచ్చిన తెల్లారి.. నెలలోపు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తాం. ఇలా అందర్నీ సమదృష్టితో సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కులం, మతం అనే తేడా లేకుండా ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.