CM KCR | తొర్రూరు, మార్చి 23: ఒళ్లు కాలిపోతున్న జ్వరంతో సైతం దెబ్బతిన్న పంటల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా వ్యవహరించారు. రైతుల భుజంపై చేతులేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఖమ్మం జిల్లా బోనకల్లు నుంచి ప్రారంభమైన సుడిగాలి పర్యటనలో నాలుగు జిల్లాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఎకడా భోజనం, టీ, స్నాక్స్ వంటి విరామాలకు తావివ్వలేదు. రెడ్డికుంట తండా పర్యటన ముగించుకుని అడవిరంగాపురం బయలుదేరే ముందు తన వెంట తెచ్చుకున్న సద్దిమూటను బస్సులోనే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తిన్నారు. బిజీ షెడ్యూల్లో కొద్దిపాటి విరామాన్ని కల్పించుకుని పరిమితంగానే భోజనాన్ని ముగించారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తన వెంట తెచ్చిన పులిహోర, కూరలను సీఎం, మంత్రులు, అధికారులందరికీ స్వయంగా కొసరి కొసరి వడ్డించారు.