హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉద్యమాన్ని చివరికంటూ కొనసాగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ స్ఫూర్తి, పట్టుదల అద్భుతమని బీహార్ మాజీ సీఎం లూలూప్రసాద్ యాదవ్ కొనియాడారు. బుధవారం బీహార్ పర్యటనలో చెక్కుల పంపిణీ అనంతరం లాలూను ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ నివాసంలో కేసీఆర్ కలిశారు. లాలూ యోగక్షేమాలు వాకబు చేశారు.
నాటి తెలంగాణ ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను ఇరువురు గుర్తుచేసుకొన్నారు. ‘ఢిల్లీలో మీ ఇల్లు, నా ఇల్లు పక్కపక్కనే ఉండేది. మా ఇంట్లో పెండ్లిళ్లకు చాలాసార్లు మీ ఇల్లు వాడుకొన్నా. తెలంగాణ ఉద్యమం కోసం బేషరతు మద్దతిచ్చాం. తెలంగాణ ఎలా ఉన్నది’ అని సీఎం కేసీఆర్ను లాలూ అడిగారు. అనతికాలంలోనే తెలంగాణ అభివృద్ధి సాధించిన విషయాన్ని కేసీఆర్ వివరించారు. సంతృప్తి వ్యక్తం చేసిన లాలూ.. కేసీఆర్ను అభినందించారు. కార్యక్రమంలో లాలూ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.