ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ సతీమణి రజని, పిల్లలకు బీఆర్ఎస్ రూ.కోటి సాయాన్ని అందజేసింది. ఈ మేరకు పార్టీ తరఫున సోమవారం వారికి చెక్కును అందజేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ తదితరులు
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ‘గులాబీ గొడుగు కింద ఉంటే సీఎం కేసీఆర్ గుండెల్లో ఉన్నట్టే.. ఆయన మానవీయ స్పర్శను జీవితాంతం వెంటబెట్టుకున్నట్టే..’ ఇది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి సీఎం కేసీఆర్ వెంట నడిచినవారు తరచూ చెప్పుకునే మాట. ఇది అక్షరాలా నిజం అని ఇటీవల జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆయా కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. పిల్లల చదువులు, ఇతర కష్టసుఖాల్లో భాగం పంచుకుంటున్నది. ఇటీవల అకాల మరణం చెందిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ కుటుంబాలను కన్నబిడ్డల్లా.. కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నది. ఈ ఇద్దరు యువ నేతలు తెలంగాణ ఉద్యమంలోనూ, బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ పోషించిన పాత్రను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ ఆయా కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలిచేలా నిర్ణయం తీసుకున్నారు. పార్టీని నమ్ముకొని క్రమశిక్షణ గల సైనికులుగా వ్యవహరించిన వారిని సీఎం కేసీఆర్ కంటికి రెప్పల్లా కాపాడాకుంటారనడానికి సాయిచంద్, కుసుమ జగదీశ్ కుటుంబాలే సాక్ష్యంగా నిలుస్తాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు సాయిచంద్, ఉద్యమకారుడు, ములుగు దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబాలకు శాశ్వతంగా అండగా ఉండాలని నిర్ణయించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఒక్కో కుటుంబానికి రూ.1.5 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. సాయిచంద్ సతీమణికి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్గా అవకాశం కల్పించారు. ఆమె ఆ పదవిలో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ రెండు కుటుంబాలకు ప్రకటించిన కోటిన్నర మొత్తాన్ని సోమవారం అందజేశారు. కుసుమ జగదీశ్ ముగ్గురు పిల్లలకు రూ. 25 లక్షల చొప్పున, తల్లిదండ్రులకు రూ.25 లక్షలు, మిగిలిన మొత్తాన్ని ఆయన సతీమణికి అందజేశారు. పార్టీ ప్రకటించిన ఆర్థిక సాయంతోపాటు ఉద్యమ సహచరుడు అకాల మరణం చెందటంతో ఆ కుటుంబానికి అండగా పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు నిలిచారు. కుసుమ జగదీశ్ పిల్లల ఉన్నత చదువుల బాధ్యతను ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి స్వీకరించారు. తమ విద్యాసంస్థల్లో జగదీశ్ పెద్దకుమారుడిని చేర్చుకున్నారు. మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తనవంతుగా రూ.10 లక్షల సాయాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ హైదరాబాద్లోని సాయిచంద్ ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం అందజేశారు. సాయిచంద్ సతీమణి రజినికి రూ.కోటి, సాయిచంద్ తండ్రి, సోదరికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున అందజేశారు.
ఇటీవల మృతిచెందిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. పార్టీ తరఫున రూ.కోటిన్నర చెక్కును సోమవారం జగదీశ్ కుటుంబసభ్యులకు అందజేస్తున్న మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, ములుగు, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థులు నాగజ్యోతి, తెల్లం వెంకట్రావు తదితరులు
దివంగత సాయిచంద్ తల్లిదండ్రులు పద్మమ్మ, వెంకట్రాములుకు, చెల్లెలు ఉజ్వలకు బీఆర్ఎస్ పార్టీ రూ.50 లక్షల సాయం అందజేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సోమవారం వనపర్తి జిల్లా అమరచింతలోని సాయిచంద్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు చెక్కులను అందజేశారు.