సంగారెడ్డి, జూలై 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ్రీరామరక్ష అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. చరిత్రలో ఎన్నడూ రానంత వరదలు ముంచుకొస్తే.. బీజేపీ, కాంగ్రెస్ బురద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంతటి వరదల్లోనూ ప్రాణ నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకొంటూనే.. బాధితులను అన్ని విధాలుగా ఆదుకొంటున్నారని చెప్పారు. వరద సహాయం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో వరదలపై కేంద్రంలోని బీజేపీ సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు. ప్రధాని మోదీ పేదలను కొట్టి.. గద్దలకు సంపద పంచిపెడుతున్నారని మండిపడ్డారు. ఉచిత పథకాలు వద్దంటున్న మోదీ.. బ్యాంకుల్లోని దేశ సంపదను కొల్లగొట్టిన నీరవ్ మోదీ, లలిత్ మోదీ వంటి వారికి రూ.12 లక్షల కోట్లు ఎలా మాఫీ చేశారని ప్రశ్నించారు. ఇలాంటివాళ్లు అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి, రైతుబంధు పథకాలను రద్దుచేస్తారని హెచ్చరించారు.
పార్టీ ఆఫీసు రాజకీయాలు
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, గోదావరిలో 29 లక్షల క్యూసెక్కులు ప్రవహించిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. బాధితులకు ఆహార ధాన్యాలతోపాటు రూ.పది వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని వెల్లడించారు. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పార్టీ ఆఫీసుల్లో కూర్చొని బురద రాజకీయాలు చేస్తున్నాయన్నారు.
వరదబాధితులకు అండగా నిలిచి ధైర్యం చెప్పాల్సిన బాధ్యతను మరచిపోయి.. ప్రభుత్వంపై రాళ్లు విసరడం పనిగా పెట్టుకొన్నారని విమర్శించారు. ఇతర రాష్ర్టాలకు వరద సహాయం చేస్తున్న బీజేపీ సర్కారు, తెలంగాణపై కక్ష సాధిస్తున్నదన్నారు. కేంద్రం నుంచి వరద సహాయం అందజేలా రాష్ట్ర బీజేపీ నాయకులు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇకనైనా స్పందించి నిధులు ఇవ్వాలని, లేదంటే ముంపు బాధితులు కేంద్ర ప్రభుత్వాన్ని క్షమించరని అన్నారు. వరద బాధితులకు పేదలకు అండగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ను ఎన్నటికీ మరువరన్నారు.
ఈజీఎస్ను ఆపేందుకు కేంద్రం కుట్ర
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ముందుకు సాగనివ్వకుండా ఆపేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని మంత్రి హరీశ్రావు అనుమానం వ్యక్తం చేశారు. యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు చేశారన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకోవాల్సి ఉండగా తీసుకోవడం లేదన్నారు. దీంతో మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యం వర్షాలకు మొలకెత్తే పరిస్థితి నెలకొందన్నారు.
బెంగాల్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో సైతం ఈజీఎస్ పథకాన్ని ముందుకు సాగనివ్వకుండా ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని అనుమానం వ్యక్తంచేశారు. ఏటా కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్ పనుల పరిశీలించేందుకు ఒకటి లేదా రెండు తనిఖీ బృందాలను రాష్ర్టానికి పంపుతున్నదన్నారు. ఎన్నడూ లేనివిధంగా ఈ దఫా రాష్ర్టానికి 18 తనిఖీ బృందాలను కేంద్రం పంపినట్టు చెప్పారు. 18 బృందాలు రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలో పర్యటిస్తూ ఈజీఎస్ పనులను పరిశీలిస్తూ గుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శింరు. వర్షాల కారణంగా చెరువు కట్టపై నుంచి మట్టి కూలినా, చెరువులో మట్టిపూడుకు పోయినా తనిఖీ బృందాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దు
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉచిత కరెంటు, రైతుబంధు తదితర పథకాలు రద్దు కావటం ఖాయమని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2 వేల పింఛన్, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబందు పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ఈ పథకాలు వద్దని బీజేపీ చెబుతోందని విమర్శించారు. రాష్ట్రంలో త్వరలో మరో 10 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నూతన డైట్ పాలసీ ద్వారా రోగులకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు.