CM KCR | హైదరాబాద్ : గత రెండు, మూడేండ్ల క్రితం మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్ పొలిమేరల వరకు మిడతల దండు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మిడతల దండును తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. మొత్తానికి ఆ మిడతల దండును తెలంగాణలోకి రాకుండా నివారించగలిగారు అధికారులు.
ఇవాళ నిమ్స్ దశాబ్ది బ్లాక్కు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మిడతల దండుపై ఆసక్తికరమైన కథనాన్ని చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ అంటూ కేసీఆర్ మిడతల దండుపై ప్రసంగం చేశారు. నాకొక విచిత్రమైన అనుభవం ఉంది. మన ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదు. ఈ మధ్య మిడతల బెడద లేదు. వెనుకటి కాలంలో ఉండేది. మహాకవి శ్రీనాథుడు నిర్బంధంలో ఉండి చనిపోయే సమయంలో పాడతాడు. పొలం కౌలుకు చేసుకుంటుంటే కృష్ణవేణమ్మ కొంత తీసుకుని పోయింది. బిలబిలాక్షులు(మిడతలు) కూడా కొంత తీసుకుపోయిందని బాధపడతాడు అని కేసీఆర్ వివరించారు.
ఈ మధ్యకాలంలో మన దగ్గర మిడత బెడద లేదు. మధ్య ఆసియా నుండి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రానికి మిడతల దండు వస్తూంటుంది. నేను చాలా ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఈ మిడతల దండు హర్యానాలోకి వచ్చి అక్కడి నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి, ఆదిలాబాద్ సరిహద్దు దాకా విస్తరిస్తూ వస్తున్నది. భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తే ఆదిలాబాద్ ఉత్తర భాగాన ఉన్న కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసి ప్రజలను, పంటలను కాపాడుకునేందుకు ఫైరింజన్లు, స్ప్రేలతో సన్నద్ధంగా ఉన్నాం. ఆ సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక మహిళా ఆఫీసర్, మన దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇద్దరు ఎంటమాలజిస్టులు దీని పర్యవేక్షణ కోసం వచ్చారు. వారికి హెలికాప్టర్ ఇచ్చి సరిహద్దులకు పంపాం. మహారాష్ట్రలోనే మిడతల దండును చంపేయడం వల్ల, అవి మన దాకా రాలేదు. అనంతరం ఆ ఇద్దరు ఎంటమాలిస్టులు మమ్మల్ని కలిసి మాకు హెలికాప్టర్ ఇచ్చి, మమ్మల్ని గౌరవించి బాగా చూసుకున్నారని ధన్యావాదాలు తెలిపారు అని కేసీఆర్ వివరించారు.
సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు కనుక్కో లేదని నేను వారిని నా అకాడమిక్ ఇంట్రస్ట్ కొద్దీ ప్రశ్నించాను. సార్ మిడతలను చంపలేము. నిర్మూలించలేము. అది అసాధ్యమని చెప్పారు. మనిషి 4 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చాడు. కానీ ఈ మిడతలు, బాక్టీరియాలు, ఇతరత్రా 8 లక్షల సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి. అవి నిద్రాణంగా ఉంటాయి. వాటికి వ్యతిరేక చర్యలతో ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయని ఎంటమాలజిస్టులు చెప్పారు. కరోనా కూడా అటువంటిదేనా అంటే అటువంటిదే అని వారు చెప్పారు అని కేసీఆర్ తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో సలహాలివ్వాలని అడిగితే, ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందో అక్కడ తక్కువ నష్టాలు జరుగుతాయని వారు చెప్పారు. లేకపోతే నష్టాలు ఎక్కువగా జరుగుతాయని వారు తెలిపారు. ఆరోగ్యశాఖ ప్రాధాన్యతను దీన్ని ద్వారా అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుండి ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఆరోగ్యశాఖను తీర్చిదిద్దాలని భావించి, ఆరోగ్య శాఖ మంత్రులను, అధికారులను పిలిచి గంటలు, రోజులు, వారాల తరబడి చర్చించి అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా భారీగా పెంచి ఈ శాఖను మనం ముందుకు తీసుకుపోతున్నాం అని కేసీఆర్ వివరించారు.