హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): నవభారత్ నిర్మాణానికి జలవిహార్ నాంది పలికింది. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు మద్దతుగా నిర్వహించిన సభలో సీంఎ కేసీఆర్.. ప్రధాని మోదీ ప్రజాకంటక పాలనపై నిప్పులు చెరిగి కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒకే ఒక్కడుగా ఇదే జలదృశ్యం నుంచి బయలుదేరిన కేసీఆర్.. ఇప్పుడు అదే వేదికగా నవభారత నిర్మాణానికి బలమైన అడుగువేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ గంటసేపు ప్రసంగించారు. ఆయన ప్రసంగించినంత సేపు సభికులు పిన్డ్రాప్ సైలెన్స్తో ఆలకించడం విశేషం. మోదీని విమర్శించినప్పుడల్లా హర్షధ్వానాలు హోరెత్తాయి. మోదీ తనకు తానే బ్రహ్మ అనుకొంటున్నారని కేసీఆర్ అనగానే ‘మోదీకి ఇగ దిమ్మతిరుగుడే..’ అని సభికులు కేకలేశారు.
శ్రీలంక కుంభకోణంలో దేశ ప్రతిష్ఠను మోదీ దిగజార్చారని కేసీఆర్ పేర్కొనగానే ‘షేమ్..షేమ్.. మోదీ’ అంటూ నినదించారు. ‘మహారాష్ట్రలో జరిగినట్టే తెలంగాణలోనూ జరుగుద్దని ఒక కేంద్ర మంత్రి అంటున్నడు.. నేనూ అదే చూస్తున్నా.. మీరెప్పుడు చేస్తరా అని.. మీరిక్కడ చేస్తే.. మేం మిమ్మల్ని ఢిల్లీ పీఠం నుంచి దింపేస్తాం’ అని కేసీఆర్ పేర్కొనగానే ఖబర్దార్ బీజేపీ.. ఖబర్దార్ మోదీ.. అంటూ నినాదాలు మార్మోగాయి. దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని యశ్వంత్సిన్హా పేర్కొనగానే ‘దేశ్ కీ నేత కేసీఆర్…’ అని నినాదాలు హోరెత్తాయి. కేసీఆర్ వేసే ఏ ఒక్క ప్రశ్నకూ మోదీ సమాధానం చెప్పడు.. కారణం ఆయన దగ్గర ఆ ప్రశ్నలకు జవాబు లేదు అని సిన్హా పేర్కొనగానే ‘షేమ్..షేమ్.. మోదీ..షేమ్’ అని నినాదాలు పిక్కటిల్లాయి.
సిన్హాకు వడ్డించిన కేసీఆర్
జలవిహార్లో బోనాలు, బతుకమ్మలు, ఒగ్గు కళాకారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. సభావేదికపై కేసీఆర్, యశ్వంత్ సిన్హా, నామా నాగేశ్వర్రావు, ప్రముఖ సామాజికవేత్త, యశ్వంత్సిన్హా ప్రచార కమిటీ సభ్యుడు సుదీంద్ర కులకర్ణి మాత్రమే ఆశీనులయ్యారు. వీరికి వేదిక మీద కుమ్రంభీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి బొట్టుపెట్టి మంగళహారతులు ఇచ్చారు. వేదిక ముందు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతిరాథోడ్, సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆశీనులయ్యారు. సీఎం కేసీఆర్, యశ్వంత్సిన్హా మధ్యాహ్నం 12.50 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు సమావేశం హాల్లో గడిపారు. అనంతరం భోజనాలు చేశారు. యశ్వంత్సిన్హాకు కేసీఆర్ స్వయంగా వడ్డించారు.
అబ్బురపడ్డ యశ్వంత్ సిన్హా
యశ్వంత్ సిన్హా టీఆర్ఎస్ చేసిన ఏర్పాట్లకు అబ్బురపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రసంగం పట్ల మంత్ర ముగ్ధులయ్యారు. తన జీవితంలో ఇంతటి అపూర్వ దృశ్యం ఆవిష్కృతం అవుతుందని అనుకోలేదని చెప్పారు. సుదీంద్రకులకర్ణి సైతం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ఆసక్తిగా వింటూ మధ్యమధ్య హర్షధ్వానాలు చేశారు. కేసీఆర్ప్రసంగం పూర్తి కావడంతోనే సుదీంద్రకులకర్ణి లేచి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతుండగా, కేసీఆర్ తన రెండు చేతులెత్తి నమస్కరించారు.