హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచాం. చైనా వంటి దేశాల్లో మాత్రమే సాధ్యమనుకునే వేగంతో ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తోంది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ‘కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకున్నం. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, చనాకా-కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన రిజర్వాయర్ మల్లన్న సాగర్. దీని నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు కాళేశ్వరం జలాలను మల్లన్నసాగర్కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు అభిషేకించి మొక్కు తీర్చుకున్నాం. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంతోపాటు, సస్యశ్యామల తెలంగాణను కూడా కన్నుల పండుగగా చూసుకోగలగటం మనందరికీ గర్వకారణం. తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 85.89 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. రాష్ట్రంలో అన్ని సాగునీటి వ్యవస్థలు, ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాం లు, ఆనకట్టలు, కత్వలు, చిన్న, పెద్ద ఎత్తిపోతల పథకాలు ఒకే గొడుగు కిందకి తెచ్చి సాగునీటి శాఖను పునర్వ్యవస్థీకరించింది. కోటి ఎకరాలకుపైగా సాగునీరు అందించడమే ధ్యేయంగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.