CM KCR | కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేయవద్దని, వాళ్లను నమ్మి ఓటేస్తే కైలాసం ఆటల పెద్దపాము మింగిట్టైతదని సీఎం కేసీఆర్ చెప్పారు. పాలకుర్తిలో మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతుండటంపై సీఎం మండిపడ్డారు. ప్రజలు వాళ్లకు ఇప్పటికే చాలాసార్లు ఛాన్స్ ఇచ్చారని, మరె వాళ్లు ప్రజల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి కనీసం మంచి నీళ్లయినా తెచ్చి ఇవ్వగలిగారా..? అని నిలదీశారు. కాబట్టి గుడ్డిగా కాంగ్రెస్కు ఓటేయకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
‘కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటున్నరు. వాళ్లకు ఒక్క ఛాన్స్ కాదు, ప్రజలు ఇప్పటికే 10, 11 ఛాన్స్లు ఇచ్చిండ్రు. మరె ప్రజల కోసం వాళ్లు ఏంజేసిండ్రు..? కనీసం కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచి నీళ్లయినా తెచ్చియ్యగలిగిండ్రా..? పైంగ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంల వేస్తరట. ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్గాంధే ఈ మాట అంటున్నడు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు అదే పాట పాడుతున్నరు. అసలు ధరణి పోర్టల్ ఎందుకు తెచ్చినం..? భూముల క్రయవిక్రయాల్లో అక్రమాలను అరికట్టడానికేగా..? ధరణి రాకముందు రైతుల మీద చాలా మొగోళ్లు ఉండెటోళ్లు. వీఆర్వో ఒక భర్త, గిర్దవార్ ఒక భర్త, ఎమ్మార్వో ఒక భర్త, ఆపైన ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఇలా చానమంది ఉండేది. రైతుల బతుకులు వాళ్ల చేతుల ఉండె. సంతకాల కోసం వాళ్ల చుట్టూ తిరగాల్సి వచ్చేంది. బిల్లు రావాల్నంటే వాళ్లకు లంచాలు ఇయ్యాల్సి వచ్చేది. ఇయ్యన్నీ పోవాల్ననే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చింది. ఇప్పుడు మీ బొటన వేలు పెట్టనిదే మీ భూమి ఎవరి పేరు మీదకు మారదు. ముఖ్యమంత్రి తల్చుకున్నా మీ భూమిని ఇంకొకరి పేరు మీదకు మార్చలేడు’ అని సీఎం తెలిపారు.
‘ఇయ్యాల మీకు రైతుబంధు వస్తుంది. దాన్ని మీరు పెట్టుబడికి వాడుకుంటున్నరు. ఎవరైనా చనిపోతే రైతుబీమా డబ్బులు వస్తున్నయ్. మీ పంటను ప్రభుత్వం కొని డబ్బులు మీ బ్యాంకుల్లో వేస్తున్నది. మరె ధరణిని తీసేస్తే ఈ సౌకర్యాలన్నీ ఉంటయా..? అన్నీ గంగల కలుస్తయ్. మళ్లీ మునుపటి లెక్క అధికారులకు లంచాలు ఇయ్యాల్సి వస్తది. అందుకే కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటెస్తే కైలాసం ఆటల పెద్ద పాము మింగినట్లు అయితది. కాబట్టి మీరు ఈ విషయంలో చర్చ చెయ్యాలె. కాంగ్రెసోళ్లు ధరణిని, రైతుబంధును, 24 గంటల కరెంటును తీసేస్తమని సాటుంగ చెప్తలేరు. బాజాప్త బాహాటంగ చెప్తున్నరు. మరె మీరు ఆలోచించకుండ ఓటేస్తే నష్టపోతరు. కాబట్టి ఓటేసెటప్పుడు దయచేసి బాగా ఆలోచన చేయాలె. మీ హక్కులను మీరు కాపాడుకోవాలె’ అని సీఎం సూచించారు.
నాకంటే దొడ్డుగున్నోళ్లు చానామంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రు
‘నేను రావాల్సిన వాటిపై మీకు అధికారాలు కట్టబెడితే కాంగ్రెసోళ్లు ఆ అధికారాలను ఊడగొడ్తమంటున్నరు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ 50 ఏండ్ల పాలన చేసింది. ఆ 50 ఏండ్ల కాలంలో నాకంటే దొడ్డుగున్నోళ్లు, నాకంటే ఎత్తుగున్నోళ్లు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. కనీసం ప్రజలకు మంచినీళ్లు ఇయ్యలే. ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నరు. లంబాడీ బిడ్డలు తమ తండాలను పంచాయితీలు చేయాలంటే చేసిండ్రా..? చెయ్యలే. ఇప్పుడు గిరిజనుల గురించి పెద్ద మాటలు చెప్తున్నరు. దళితుల కోసం దళితబంధు తెచ్చినం. మరె బీఆర్ఎస్ కంటే ముందు ఎవడన్నా దళితుల గురించి ఆలోచించిండా..?’ అని సీఎం ప్రశ్నించారు.