హైదరాబాద్: గురుకుల విద్యలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. నాడు పీవీ నరసింహారావు దార్శనికతతో ప్రారంభమైన గురుకుల విద్యాలయాల వ్యవస్థ, నేడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో శిఖరాయమానమైన స్థాయికి చేరిందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను (Telangana Decade celebrations) సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఒక్క జూనియర్ కాలేజీ స్థాపన కోసం దశాబ్దాల తరబడి వేచిచూసే దుర్గతి అనుభవించిన తెలంగాణలో నేడు 1,002 గురుకుల జూనియర్ కళాశాలలు కొలువుదీరడం రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన చారిత్రాత్మక పరిణామమని పేర్కొన్నారు.
తెలంగాణలో విద్యావ్యవస్థ గురించి సీఎం ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ‘పేద విద్యార్థులు చదువులో ముందుండాలంటే అది గురుకుల విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నది తెలంగాణ ప్రభుత్వ విశ్వాసం. అందుకే రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేసుకున్నాం. నేడు చక్కని సౌకర్యాలతో 1,002 వరకు గురుకులాలను ఏర్పాటు చేసుకున్నాం. అవి 5 లక్షల 59 వేల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన వసతులతో కూడిన విద్యను అందిస్తున్నాయి. వీటి నిర్వహణకు బడ్జెట్ కూడా భారీగా పెంచాం. ఉత్తమ ఫలితాల సాధనలోనూ మన విద్యార్థులు ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. నేడు మన రాష్ట్రంలో గురుకుల కళాశాలల విద్యార్థుల కోసం కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి బహుళజాతి సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించే స్థాయికి గురుకులాలు ఎదిగాయి. నిరక్షరాస్య కుటుంబాల నుంచి వచ్చిన పేద విద్యార్థులు గురుకులాలలో శిక్షణ పొంది దేశంలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలను సాధిస్తున్నారు. మన గురుకుల విద్యార్థుల ప్రతిభ ఎవరెస్టు శిఖరాన్ని తాకేంత ఎత్తుకు ఎదిగింది’ అని సీఎం చెప్పారు.
‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరిచేందుకు ‘మన ఊరు – మన బడి’ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకం కింద డిజిటల్ విద్యతోపాటు 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలల్లో మూడు దశల్లో ఈ మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అనుగుణంగా ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇప్పించాం. భావి భారత పౌరులు ఆరోగ్యంగా, బలవర్ధకంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాస్టళ్ళు, ఇతర విద్యాసంస్థలలో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. ఇటీవల విడుదలైన ఫలితాలలో రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో సంతృప్తికరమైన ఫలితాలు వచ్చాయి. వివిధ రాష్ట్రాల స్థితిగతుల ఆధారంగా ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ ప్రకారం పిల్లల ఎన్రోల్మెంట్ లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. విద్యా బోధనలోనూ, విద్యార్థుల అభ్యసన ప్రక్రియలోనూ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ విద్యాశాఖ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం వేళ ఉపాహారంగా పౌష్టిక విలువలు నిండిన రాగిజావను అందించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నా’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
‘పేద విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడమే ఒక కల. అలాంటిది విదేశీవిద్య చదవాలంటే అసాధ్యం అనే భావన ఇదివరకు ఉండేది. కానీ, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తెలంగాణ ప్రభుత్వం ఘనత. ఎంతో చురుకైన విద్యార్థులు ప్రతిభావంతులై ఉండి కూడా ఆర్థికస్తోమత లేక ఉన్నత విద్యకు దూరం కాకూడదు. అందుకే, వారికి రూ.20 లక్షల విదేశీ విద్య ఉపకార వేతనం అందించుకుంటున్నాం. దళిత సామాజిక వర్గానికి భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ పేరిట, బలహీన వర్గాల వారికి, ఈబీసీలకు మహత్మా జ్యోతిబాపూలే పేరిట, బ్రాహ్మణులకు వివేకానంద విదేశీ విద్యా పథకం పేరిట, మైనారిటీలకు కేసీఆర్ ఓవర్సీస్ విద్యాపథకం పేరిట రూ. 20 లక్షల సహాయం సమకూరుస్తున్నాం. ఈ పథకం కింద లబ్ధిపొందిన అనేక మంది విద్యార్థులు నేడు వివిధ దేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, వారికి ఎటువంటి ఆపద ఎదురైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, నేనున్నానంటూవారిని ఆదుకొంటోంది. విదేశమైన ఉక్రెయిన్ సంఘటనలోగానీ, మనదేశంలోని మణిపూర్ సంఘటనల సందర్భంగా గానీ మన ప్రభుత్వం ప్రత్యేక విమానాలను పంపి ఆయా ప్రాంతాలలోని మన విద్యార్థులను సురక్షితంగా ఇంటికి చేర్చి ఆదుకున్న విషయం మీకు అందరికీ తెలిసిందే’ అని కేసీఆర్ అన్నారు.