వరంగల్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆఖరి రోజైన మంగళవారం వరంగల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఉన్న ఈ వరంగల్ వీరభూమికి తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు వరంగల్ పట్టణమే వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ఉద్యమంలో అతి భారీ బహిరంగ సభ ఈ వరంగల్ నగరంలోనే జరిగిందని, భద్రకాళీమాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నమని అన్నారు. అమ్మవారికి కిరీట ధారణ చేసి తాను మొక్కు కూడా చెల్లించుకున్నానని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘అన్నింటికన్నా మించి వరంగల్కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏందంటే.. రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టడం, చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి మిషన్ కాకతీయ అని పేరు పెట్టడం. ఇది కాకతీయ రాజులకు తెలంగాణ ప్రజలు అర్పించిన నిజమైన నివాళి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను ఉద్యమాన్ని తలకెత్తుకున్న సందర్భంలో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజాకవి కాళోజీ గారిని, నాకు ఆ రోజు అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని నేను మనఃపూర్వకంగా స్మరించుకుంటున్నా. ఈ సందర్భంగా నేను చెప్పేదేందంటే ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలె. మీరు వేసే ఓటు తెలంగాణతోపాటు వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తది. కాబట్టి అసుంటి ఓటును ఆషామాషీగా వేయవద్దు. మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి వేయాలె. అప్పుడే మంచి జరుగుతది. కాబట్టి మీ గ్రామాలల్లో బాగా చర్చించి, మంచి పార్టీ ఏదో, మంచి అభ్యర్థి ఎవరో తేల్చుకుని ఓటేయాలె’ అని సూచించారు.
‘కాంగ్రెస్ నేతలు తమ పార్టీ గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అరాచకాలు జరిగినయ్. తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చిచంపిండ్రు. ఎమర్జెన్సీ పెట్టి అందర్నీ జైళ్లల్ల పెట్టిండ్రు. అసుంటి రాజ్యం మళ్ల గావాల్నా..? కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు మనలను గోసపెట్టింది. కొట్లాడంగ, కొట్లాడంగ ఆఖరికి తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ ఏర్పడంగనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతబంధు, రైతుబీమా లాంటి పథకాలు తీసుకొచ్చినం. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తాము నిర్ణయాలు చేసినం’ అని చెప్పారు.