కొల్లాపూర్: కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం.. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను విడమర్చి చెబుతూ దుమ్మెత్తి పోశారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావద్దని, రాయేదో.. రత్నమేదో గుర్తించి ఓటేయాలని ప్రజలను కోరారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరువు, కాటకాలే రాజ్యమేలినయని ఆయన విమర్శించారు.
‘ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు. ఎవరికి పడితే వాళ్లకు గుడ్డిగా ఓటేయొద్దు. రాయేదో రత్నమేదో గుర్తించి ఓటేయాలె. ఏ అభ్యర్థి ఎసుమంటోడు. వాళ్ల వెనుక ఉన్న పార్టీ చరిత్ర ఎసుమంటిది అనేది చూడాలె. ఏ పార్టీ బాగా పనిచేస్తది. ఏ పార్టీ పని చేయదు అనేది గూడా గమనించాలె. అందుకోసం ఏ పార్టీ చరిత్ర ఏందో తెలుసుకోవాలె. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యంల ఎంత అన్యాయం జరిగిందో గుర్తు చేసుకోవాలె. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తే, 14 ఏండ్లు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈ 14 ఏండ్లళ్ల టీఆర్ఎస్ పార్టీని చీల్చడానికి ఎన్నో కుట్రలు చేసిండ్రు. ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్రు’ అని సీఎం చెప్పారు.
‘50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరువు, కాటకాలే ఉండె. ఇందిరమ్మ రాజ్యమంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేకుండె. ఇందిరమ్మ హయాంల ఇతర పార్టీలోళ్లను రాచిరంపాన పెట్టిండ్రు. దోపీడీ చేసిండ్రు గానీ, ప్రజల బాగోగులు పట్టించుకోలే. వాళ్ల ఖర్మకు వాళ్లను వదిలేసిండ్రు. కొల్లాపూర్ గతి ఏముండె. గుంపు మేస్త్రీలు ఉండిరి. పెద్దకొత్తపల్లి, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల నుంచి బొంబాయికి తొవ్వ ఉండె. గుంపు మేస్త్రీలు ఉండి బొంబాయికి తొవ్వవట్టిన బతుకు మనది. మరి ఇయ్యాల ఎవడో వచ్చి ఏదో చెప్పిండని గోల్మాల్ అయిదామా..? వెనుకటి రోజులు మళ్ల తెచ్చుకుందామా..? బిచ్చగాళ్లకు పెట్టినట్టు గంజి కేంద్రాలు పెట్టిండ్రు ఇక్కడ ఇంక సిగ్గులేకుండా’ అని సీఎం మండిపడ్డారు.