CM KCR | నిజామాబాద్ : ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అనే పార్టీలు వస్తాయి.. అనేక మంది నాయకులు అనేక మాటలు చెప్తారు. కానీ ఆలోచన చేసి ఓటు వేయాలి. ఆగమాగం కావొద్దు. సొంత విచక్షణతో ఓటు వేయాలి. ఎవరో చెప్పారు అని ఓటేస్తే పరిస్థితి ఉల్టాపల్టా అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పదేండ్ల కింద మన పరిస్థితి ఎలా ఉండే.. ఇవాళ ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలి అని కేసీఆర్ సూచించారు. జుక్కల్ నియోజకవర్గం వెనుకబడ్డ ప్రాంతం.. కారు చీకటి, మంచినీళ్లు, సాగునీళ్లు లేవు. దూర ప్రాంతాలకు వలసపోయిన పరిస్థితి. రైతులు అప్పులు కట్టలేక, బోర్లు వేయలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అవన్నీ మనం చూశాం. నేను 27 బోర్లు వేస్తేకానీ నీళ్లు రాలేదు. అలాంటి బాధలు మనం అనుభవించాం అని కేసీఆర్ గుర్తు చేశారు.
ఇవాళ తెలంగాణలో మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నాం. 100 ఏండ్ల కింద నిజాం రాజు నిజాం సాగర్ కట్టారు. సమైక్య పాలకుల రాజ్యంలో నిజాంసాగర్ ఎండిపోయింది. మన బాధలు ప్రపంచానికి తెలియాలని ఎండిపోయిన నిజాం సాగర్లోనే తెలంగాణ ఉద్యమం మీటింగ్ పెట్టుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.
అలా ఎన్నో బాధలు పడ్డ తర్వాత 2000లో ఉద్యమానికి శ్రీకారం చుడితే.. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తు కలిసిందని కేసీఆర్ గుర్తు చేశారు. 2004లో కాంగ్రెస్ తెలంగాణకు డోఖా చేసింది. అప్పుడే తెలంగాణ ఇస్తే బాగా బాగుపడేవాళ్లం. 14 ఏండ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. దగా చేశారు. నేనే నడుం కట్టి కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా అని ప్రకటన చేసి ఆమరణ దీక్ష చేపడితే దిగివచ్చి ప్రకటన చేశారు. మళ్లీ ఇబ్బందులు పెట్టారు. తర్వాత ఉద్యమం చేస్తే దిగివచ్చి తెలంగాణ ఇచ్చారని కేసీఆర్ తెలిపారు.
ఒక దాని తర్వాత ఒక సమస్యను పరిష్కారం చేసుకుంటూ వచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు. జుక్కల్లో మంచినీళ్ల బాధలు చూశాం. కానీ ఇవాళ మిషన్ భగీరథతో మంచినీళ్లు ఇస్తున్నాం. ఈ పథకం విజయంవంతం జరగుతోంది. మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. కాబట్టి మంచి చెడ్డలను ఆలోచించి ఓట్లు వేయాలి తప్ప ఆగమాగం వేయొద్దు. షిండే అద్భతుమైన మంచి మనిషి, ప్రేమగా ఉండే మనిషి. తన వద్దకు ఎప్పుడొచ్చినా.. వ్యక్తిగతమైన పని అడగలేదు. మాది వెనుకబడ్డ ప్రాంతం అని ప్రాజెక్టుల, నీళ్లు అడిగారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
మరో గొప్ప వ్యక్తి బీబీ పాటిల్ ఎంపీ ఉన్నారని కేసీఆర్ తెలిపారు. పాటిల్ కంటే ముందు చాలా మంది ఎంపీలు అయ్యారు. ఎవ్వడు ఏ పని చేయలేదు. పాటిల్ ఆధ్వర్యంలో హైవే రోడ్లు వచ్చాయి. ఇంకా వారు కృషి చేస్తున్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకు శ్రద్ధతో పని చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు అయితే రోడ్లు లేక డ్రోన్ ద్వారా మందులు అందించిన పరిస్థితులను చూశాం.. ఇప్పుడు చాలా వరకు బాధలు తీరాయి. జుక్కల్లో మంచి కార్యక్రమాలు జరిగాయి. మీరంతా త్రివేణి సంగమం లాంటి ప్రాంతంలో ఉన్నారు. మీలో చాలా ఎక్కువ మంది పాండురంగ భక్తులు ఉన్నారని కేసీఆర్ తెలిపారు.