జగిత్యాల : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 62 వేల కోట్ల బడ్జెట్ ఉంటే.. ఈసారి రూ. 2 లక్షల 20 వేల కోట్లు దాటిపోనుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు.
మంచి చక్కటి పరిపాలన భవనాన్ని నిర్మించుకుని నా చేతుల మీదుగా ప్రారంభించుకున్నందరకు ప్రజాప్రతినిధులకు, అదికారులకు, ప్రజలకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు. నూతన కలెక్టరేట్లలో ఇది 14వ కలెక్టరేట్. మిగతావికి కూడా త్వరలోనే ప్రారంభం చేసుకోబోతున్నాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేకసార్లు మీ వద్దకు వచ్చాను. రాజకీయ నాయకులుగా ఉద్యమం చేసే సందర్భంలో మీరు కూడా పెన్ డౌన్ చేసి తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ ఏర్పడుతుంది. దీనికి మంచి అవకాశాలు ఉన్నాయి. ధనిక రాష్ట్రం అవుతుందని నాడే చెప్పాను. అత్యుత్తమ శాలరీలు వస్తాయని చెప్పాను. అది నిజమైంది. ఎవర్నీ వదలకుండా అన్ని వర్గాలు ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
పరిపాలన చేసే వారు రాజ్య కార్యాన్ని నిర్వహించే వారు న్యాయ మార్గంలో పరిపాలించాలని చెప్పారు. జనమంతా సుకంగా ఉండాలని కోరుతారు. బేధాభిప్రాయం లేకుండా తెలంగాణ మనదే అని చెప్పి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. విజయవంతం అయ్యాయి. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. రాష్ట్రం ఏర్పడప్పుడు అనిశ్చిత స్థితి. కరెంట్ బాధలు, సాగునీళ్లు లేవు. వలసలు, కరువు. కారు చీకట్లలాంటి పరిస్థితి. కానీ అన్ని సమస్యలను అనతి కాలంలోనే అధిగమించామని చెప్పారు.
అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతో చర్చించి, సరైన అంచనాలు వేసి రాష్ట్రం యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించుకున్నామని కేసీఆర్ తెలిపారు. దేశంలో అనేక విషయాల్లో మనం నంబర్ వన్ ఉన్నాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్తో పాటు పలు రాష్ట్రాలను జీఎస్డీపీలో, పంటల ఉత్పత్తి, తలసరి విద్యుత్ వినియోగంతో పాటు అనేక రంగాల్లో నంబర్ వన్గా ఉన్నాం. ఇదంతా సాధ్యమైందంటే ఒక కేసీఆర్, ఒక సీఎస్, మంత్రులతో కాదు మనందరి సమష్టి కృషి అని పేర్కొన్నారు. కరువులు, వలసలతో ఉన్న తెలంగాణ.. అనతి కాలంలోనే ఉన్నత స్థాయి చేరుకుంది. అద్భుతమైన ప్రగతి ప్రస్థానాన్ని సాధించాం. దేశానికే ఆదర్శంగా నిలిచాం. మనం కచ్చితంగా బాగుపడాలనే అభిప్రాయంతో అందరం కష్టపడ్డామని కేసీఆర్ స్పష్టం చేశారు.