CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): దేశగతి మారే వరకు మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో రోజుకు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రధాని ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతులు సింహాల్లా గర్జించాలని పిలుపునిచ్చారు. దేశం గుణాత్మక మార్పు చెందేవరకు బీఆర్ఎస్ మడమ తిప్పని పోరాటం చేస్తుందని చెప్పారు. రాజకీయాల కోసం బీఆర్ఎస్ పుట్టలేదని, బీఆర్ఎస్ ఎవరికీ భయపడదని స్పష్టంచేశారు. ఔరంగాబాద్లో సోమవారం బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…
గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు
దేశం మార్పు చెందాల్సిన అనివార్యత ఉన్నది. దేశ స్థితి మారనంత వరకు మన బతుకులు మారవు. అద్భుతరీతిలో మార్పు జరగాలి. మార్పు అంటే రాజకీయ పార్టీలు మారడం కాదు.. ప్రజల జీవితాల్లో మార్పులు రావాలి. ఎన్నికల్లో ఒక పార్టీ గెలిచి.. మరోపార్టీ ఓడిపోవడం కాదు. ప్రజలు గెలవడమే అసలైన మార్పు. దేశంలో ఇప్పటిదాకా అనేక పార్టీలను, నాయకులను చూశాం. కానీ పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నచందంగా ఉన్నది. ప్రజల సమస్యలు ఏమైనా మారాయా అంటే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇది కాదు మార్పు అంటే.
రైతుల బలవన్మరణాలు ఎందుకు?
దేశంలో ఏం జరుగుతున్నది? రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో దయచేసి ఆలోచించండి. మనం ఆగం కాకుండా.. తలబద్దలు కొట్టుకోకుండా ఆలోచించండి. నీళ్లు, విద్యుత్తు సమస్య ఎందుకున్నది? దేశంలో 41 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నది. దేశంలో సాగునీటికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత లేదు. అవసరమైనదాని కన్నా రెట్టింపు నీటి వనరులు దేశంలో ఉన్నాయి. కానీ, దేశంలో ఎందుకు నీటి సమస్య ఉన్నదో ఆలోచించండి. నీరు లేక కాదు.. పుష్కలమైన నీరుంది. కానీ లేనిది ఏమిటి? దేశాన్ని పాలించే ప్రధానమంత్రికి, రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఈ సమస్యను తీర్చాలన్న మనసు లేదు. ఇలా ఎంతకాలం సాగాలి? రైతుల ఆత్మహత్యలు ఒకవైపు కొనసాగుతుంటే పాలకులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రాజకీయాలపైనే ఆలోచిస్తున్నారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నెహ్రూ హయాంలో దేశ స్థితిగతులకు అనుగుణంగా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ దేశాన్ని పట్టించుకోలేదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
రైతులు సింహాల్లా గర్జించాలి
దేశంలో ప్రతిరోజూ వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పవిత్రభూమి మహారాష్ట్రలో అనేక నదులు ప్రవహిస్తున్నాయి. అయినా ఇక్కడ రోజుకు ఆరేడుమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని శంకరన్న (మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోంగ్డే) చెప్తున్నారు. ప్రధానమంత్రి, దేశాన్ని నడిపే నాయకులు ఏం తెలుసుకున్నారు? ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మనం బాధపడుతుంటే.. వాళ్లు మాత్రం ఇది ఆఫ్రికా పులి.. ఇది నమీబియా పులి.. వీటిని చూసి సంతోషపడండి అని చెప్తున్నరు. ఇదా మన రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సమస్యకు ఇది పరిష్కారం కాదు. రైతులు పులుల్లా మారేందుకు సిద్ధపడాలి. నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి.. ఎప్పటిదాకా మనం పులుల్లా తయారు కామో అప్పటిదాకా మన సమస్యకు పరిష్కారం దొరకదు. దీనిపై షేత్కరీ సంఘటన రైతులను చైతన్యవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశంలో మార్పు కోసం సిద్ధంకండి. దేశం గతిని మార్చకపోతే ప్రగతి సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తించండి. ఇప్పటివరకు దేశాన్ని అనేక పార్టీలు.. నాయకులు పాలించారు. కానీ అభివృద్ధి ఏం జరిగిందో మనకు తెలుసు. మన కండ్ల ముందే ఉన్నది.
బీఆర్ఎస్ ఎవరికీ భయపడదు..
దేశంలో గుణాత్మక మార్పులు తేవటమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఒక ఎన్నికల కోసమో, ఒకరోజు కోసమో, ఒక వర్గానికో.. ఒక ధర్మం కోసమో.. ఒక జాతి కోసమో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ కాదు. 142 కోట్ల మంది భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం.. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పుకోసమే బీఆర్ఎస్ పుట్టింది. బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేయటానికి.. అపవాదులు మోపటానికి ఇప్పటికే ఉన్న పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. అధికారం ఉన్న చోట పోలీసులను ఉసిగొల్పి కేసులు పెట్టిస్తారు. కానీ, భయపడాల్సిన అవసరం లేదు. భయపడుతూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంటే మనకు స్వాతంత్య్రం వచ్చేది కాదు. ఇప్పటికీ మనం బ్రిటీషోల్లకు గులాములుగా ఉండేవాళ్లం. వెలుగుతున్న దీపానికి దేవుడి రక్షణ.. దయ ఎంతకాలం అయితే ఉంటుందో.. అప్పటిదాకా ఆ వెలుతురు ఆరిపోదు. చీకటిని పారదోలుతూ ప్రకాశిస్తూనే ఉంటుంది. మనం ఎవరికీ భయపడాల్సిన అసవరం లేదు. మనల్ని భయపెట్టి ఎవరూ ఏమీ చేయలేరు. మన పోరాటంలో నీతి.. నిజాయితీ ఉన్నది. మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. దేవుడి దయా.. కరుణ మన నిజాయితీగల పోరాటానికి అండగా ఉంటాయి. దేవుడి గుడిలో చీకటి ఉండదు. వెలుగే ఉంటుంది. ఇందుకోసమే మనం ముందుకు సాగాలి.
మహారాష్ట్ర కన్నా తెలంగాణ చిన్నది. తెలంగాణాలో ఉచితవిద్యుత్తు సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు? ఇక్కడి నేతలకు చిత్తశుద్ధిలేదు. అందుకే ఇక్కడ విద్యుత్తు కోతలు. అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. దేశాన్ని చీకటిలోకి నెట్టే ఉంచుతున్నారు. ఇది విద్యుత్తు రంగ నిపుణులూ చెప్తున్న మాట. నేను చెప్పింది అవాస్తవమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికైనా నేను సిద్ధం.
– సీఎం కేసీఆర్
నయా ఢంగ్సే.. నయా జంగ్
మనకంటే దయనీయంగా ఉండే చైనా ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నది. సౌత్కొరియా మున్ముందుకు సాగిపోతున్నది. అణువిస్ఫోటనాన్ని ఎదుర్కొని.. బాంబులను దిగమింగిన జపాన్ దేదీప్యమానంగా వెలిగిపోతున్న చరిత్రను మనం చూస్తున్నాం. అలాగే మహమ్మద్ మహతీర్ నేతృత్వంలోని మలేషియాలోనూ మార్పులు వచ్చాయి. సింగపూర్లో ఒకప్పుడు మనకన్నా దయనీయమైన పరిస్థితి ఉండేది. కానీ ఇవ్వాళ సింగపూర్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. 75 ఏండ్ల స్వతంత్రభారతదేశ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ‘నయా ఢంగ్సే.. నయా రంగ్సే.. నయా జంగ్’ చేస్తూ నవీనభారతాన్ని నిర్మిద్దాం. దేశ పరివర్తన కోసం నడుం కడదాం.
నాగపూర్లో పార్టీ శాశ్వత కార్యాలయం
కిరాయివాళ్లం కాదు శాశ్వతదారులం. హక్కుదారులం. నాగపూర్లో బీఆర్ఎస్కు శాశ్వత కార్యాలయాన్ని కొనుగోలు చేశాం. అభయ్ భాయ్ (అభయ్పాటిల్) మరికొంతమంది కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఓ భవనం కొనుగోలు చేశారు. నాగ్పూర్ కేంద్రంగా బీఆర్ఎస్ పనిచేస్తూనే ఉంటుంది. భారత్ గుణాత్మక మార్పు చెందేవరకు మడమతిప్పని పోరాటం చేస్తుంది.