CM KCR | కాంగ్రెస్ మళ్లీ ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తెస్తామంటుందని.. ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పాలనపై కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తిపోశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఏం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఉన్నన్ని రోజులు ఏమైంది మన బతుకు ? ఆ నాడు చేసింది చాలాక మళ్లీ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నరు సిగ్గులేకుండా. ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెబుతున్నరు. ఇందిరమ్మ రాజ్యంలో ఏముండే ? మనం చూడలేదా? ఎన్టీ రామారావు పార్టీ రెండురూపాయలకు కిలోబియ్యం ఇచ్చేదాక ఆకలి బతుకులే కదా? ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులు. అంత ఎండి సచ్చినం. ఎవ్వడు ఆదుకున్నోడు లేడు. పేదల బాధలు పట్టించుకున్నోడు లేడు. పేదలకడుపు నింపాలన్న సోయి లేదు. రైతుల పొలాలకు నీరిచ్చే సోయి లేదు. ఏదీ చేయలేదు’ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తెలంగాణను ఆగం పట్టించి.. తెలంగాణ బతుకును నాశనం చేశారు. ఆ నాడు జరిగిన అన్యాయాలన్నీ ఒకటి ఒకటి సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ఆర్డీఎస్పై తుమ్మిళ్ల ఎత్తిపోతల కట్టుకున్నాం. దాని ద్వారా 35వేల ఎకరాలకు నీరు వస్తుంది. మిగిలినదానికి రావాల్సి ఉంది. మల్లమ్మకుంట రిజర్వాయర్ ఇక్కడ కావాలి. తప్పకుండా రిజర్వాయర్ను చేసి పెడతాం. చిన్నోనిపల్లి త్వరగా పూర్తి కావాలి. నెట్టెంపాడు 99-100 ప్యాకేజీ పెండింగ్ పనులన్నీ పూర్తి కావాలని కోరుతున్నారు. ఇవన్నీ తప్పకుండా ఏర్పాటు చేస్తానని మనవి చేస్తున్నా. ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి ఎంత పట్టుదల ఉండే మనిషో మీకు తెలుసు. నిజాయితీ గల వ్యక్తో మీకు తెలుసు. ప్రజలకు చేశారు తప్పా.. ఎన్నడూ ఎవరిని నుంచి ఆశించిన వ్యక్తులు కాదు. మొన్నటి మొన్న ఆర్డీఎస్కు మొన్న నీళ్లు ఆగిపోయాయి.
సరిగా రాక పంటలు ఎండిపోతుంటే ఎమ్మెల్సీ ఫోన్ చేసి జూరాల లింక్ కెనాల్ నుంచి నీళ్లు ఆగిపోయినయ్.. అవివచ్చేటట్టు చేస్తే మా పంటలు బతుకుతయ్ అని పట్టుపడితే అధికారులకు మాట్లాడి నీళ్లు పంపించాను. వెంకట్రామ్రెడ్డి ప్రజల్లో ఉండే మనిషి. అలంపూర్తో పెనవేసుకున్నటువంటి కుటుంబం. కాబట్టి విజయున్ని గెలిపించాలి. వెంకట్రామ్రెడ్డి ఆధ్వర్యంలో ఆలంపూర్కు అవసరాలన్నీ తీరుస్తాను. ఇక్కడ వంద పడకల ఆసుపత్రి కావాలని కోరారు. దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. రూ.14కోట్లతో ఆర్డీఎస్ కాలువ పూడికతీత పనులన్నీ జరుగుతున్నయ్. చెరువులన్నీ మిషన్ కాకతీయ కింద బాగు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి కరువు అనేది అలంపూర్ రాకుండా చూసే బాధ్యత నాది. ఎట్లయితే తుమ్మిళ్ల రిజర్వాయర్ను కంప్లీట్ చేశామో అదే పద్ధతిలో మీకు అవసరమైన నీళ్ల కోసం అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతయ్’ అన్నారు.