హైదరాబాద్ : అప్పులు చేయడంలో మోదీని మించిన ఘనుడు లేడని సీఎం కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..‘ కాంగ్రెస్ పరిపాలనలో వార్షిక వృద్ధి రేటు 6.8 శాతం ఉండేది. బీజేపీ హయాంలో 2014-23 వరకు 5.5శాతానికి వచ్చింది. ఇది పెరుగుదలనా? తగ్గుదలా? కాంగ్రెస్ది అంతులేని భావదారిద్య్రం. దీనికి సమాధానమే చెప్పరు. ఇప్పుడు ఈ బాధ మాపై పడ్డది. ఈ విషయంపై పార్లమెంట్లోనూ ఎవరూ మాట్లాడడం లేదు. యూపీఏ పాలనలో 24శాతం గ్రోత్రేటు ఎక్కువ. ఈ లెక్కలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చినవే. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 7.01శాతం ఉంటే.. మన్మోహన్ తొమ్మిదేళ్ల పాలన 12.73శాతం ఉండేది. మన్మోహన్ పాలనతో పోల్చితే.. మోదీ పాలనలో తలసారి ఆదాయం సగానికి సగం పడిపోయింది. ఇంకా మోదీనినే లొల్లిపెడుతున్నరు. మోదీ పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కదేశాల చూసి నేర్చుకోవాలని, అప్పులు చేయొద్దని చెప్పారు. కానీ, అప్పులు చేయడంలో మోదీని మించిన ఘనుడు లేరు’ అన్నారు.
‘జీడీపీలో అప్పుల శాతం 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన సమయంలో జీడీపీకి డెట్ రేషియో 66.7శాతం ఉండేది. మన్మోమోహన్ పాలన ముగిసే సరికి 52శాతానికి తగ్గిపోయింది. దాదాపు 14శాతం మన్మోహన్ సింగ్ అప్పుల శాతాన్ని తగ్గించారు. ఇంత పెద్ద మాటలు మాట్లాడే మోదీ హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే.. 56.2శాతానికి అప్పులు పెరిగింది. మోదీ ఇంకా ఎవరిపై ఘీంకారాలు, హీంకారాలు చేస్తున్నరు? ఎవరిపై నిందలు వేస్తున్నరు? డెట్టూ జీడీపీ ఘనత వహించిన మోదీ పాలనలో 4శాతం పెరిగింది. ఇది నగ్నసత్యం. క్యాపిటల్ ఫార్మేషన్ మన్మోహన్ పాలనలో 37.5శాతం జరిగింది. మోదీ రేవ్డీ కల్చర్ అని ఎన్నో చెబుతారు. ఆయనకు ఓట్లు అక్కెర ఉంటే బియ్యం ఫ్రీ అని చెబుతడు.. అవి తినాలి ఓట్లు గుద్దాలి.. తెల్లారి మళ్లీ నెత్తిపై గుద్దాలి.. ఇదీ మోదీ దుకాణం. మిగతా వారు ఫ్రీగా ఇస్తే రేవ్డీ కల్చర్ అంటారు. క్యాపిటల్ ఫార్మేషన్ మోదీ పాలనలో జరిగింది 31శాతమే. మోదీ పాలనలో క్యాపిటల్ ఎక్స్పండేచర్, క్యాపిటల్ ఫార్మేషన్ తగ్గింది’ అన్నారు.
‘మనోహన్ పాలనలో ద్రవ్యలోటు 4.77 శాతం ఉంటే.. మోదీ హయాంలో 5.1శాతానికి పోయింది. ఏ దేశం నుంచి ఎక్కువ ఎగుమతులు జరుగుతయో.. ఆ దేశం ఆర్థికంగా పురోగమిస్తుంది. చైనా అద్భుతంగా ఇవాళ ప్రపంచాన్నే డామినేట్ చేస్తున్నది. ఎగుమతుల వృద్ధిరేటు పెరిగే.. దేశం ముందుకెళ్తున్నట్లు లెక్క. పెరగకపోతే మునుగుతున్నట్లు లెక్క. ఇందులో మన్మోహన్ సింగ్ హయాంలో గ్రోత్రేట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ 19.5శాతం ఉంటే.. మోదీ హయాంలో 4.9శాతానికి పోయింది. మరి మేడిన్ ఇండియా జోకిన్ ఇండియా అయ్యింది? విశ్వగురువు ఎక్కడపాయే. ఇందులో ఇక్కమాట అబద్ధమైనా నేను రాజీనామా చేస్తా. ఈ వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నా. అన్నీ రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలం. ఎగుమతు పెంచకుండా దేశం అభివృద్ధి కావడం అనేది అర్థంలేని ముచ్చట.
దేశ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మోదీ ప్రభుత్వానికి లేదు. పారిశ్రామిక వృద్ధిరేటు మన్మోహన్ సింగ్ పాలనలో 5.87శాతం ఉంటే.. మోదీ పాలనలో 3.2శాతం ఉన్నది. మరి ఎక్కడ వృద్ధి రేటు? అదానీ ఆస్తులు పెరిగినట్టా? ఏ రంగంలో పెరిగింది. మోదీ పాలనలో డాలర్తో పోలిస్తే రూపాయి పతనమైంది. మన్మోహన్ పాలనలో రూ.58.6 ఉండే.. మోదీ హయాంలో రూ.86.2గా ఉంది. మన్మోహన్, మోదీ పాలనతో పోల్చితే 26శాతం పడిపోయింది. ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ చేయలేదు.. మోదీ పాలనలో ఇంకా ఘోరంగా ఉందని ఆర్థికవేత్త బుక్లో రాశారు. మోదీ పాలనలో ఎన్పీఏ పేరిట 14లక్షల కోట్లు మాఫీ చేశారు. 20లక్షల కోట్లు ఎంఎస్ఎంస్ఈలకు ఇచ్చామన్నారు.. ఎవరికి ఇచ్చారో ఆ భగవంతుడికే తెలియాలి. ఏ కేంద్రమంత్రిని అడిగినా నో డేటా అవైలబుల్ (NDA) అంటరు. ఏది అడిగినా ఎన్డీఏ అంటున్నరు’ అని కేసీఆర్ విమర్శించారు.