CM KCR | తాను ఎవరి పేరును తీసుకోలేదని, ఎవరినీ విమర్శించలేదని.. వీళ్లకు దేనికి బాధ? వీళ్లకి ఎందుకు ఆక్రోషం అంటూ మహారాష్ట్ర నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మండిపడ్డారు. తుల్జాపూర్ భవానీ అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. భవానీ అమ్మవారిని దర్శించుకొని సీఎం మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ ఆశ్వీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ గారికి సాంప్రదాయబద్ధంగా తలపాగను ధరింపజేసి, శాలువాతో సత్కరించి అమ్మవారిని ప్రతిమను బహూకరించారు.
అనంతరం హైదరాబాద్కు తిరుగు పయణమయ్యారు. అంతకు ముందు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానాలు ఇచ్చారు. అమ్మవారు స్వయంగా పిలిపించుకుంటే తప్ప అమ్మవారి దర్శనం సాధారణంగా జరిగేది కాదని సీఎం తెలిపారు. ఉదయం విఠలేశ్వరుని దర్శనం, ఇప్పుడు తుల్జా భవాని దర్శనం తనకెంతో ఆనందాన్నిస్తుందని, ఇది తమకు దక్కిన అదృష్టంగా సీఎం పేర్కొన్నారు. సకల జనుల సంక్షేమం కోసం పాటుపడే తాము ఉదయం బ్రహ్మాండ నాయకుడైన విఠలున్ని, తుల్జా భవానీ మాతను కూడా అదే ప్రార్థించానని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖః సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ప్రార్థించానన్నారు.
ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలిచ్చారు. బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి సీఎం స్పందిస్తూ.. ఇప్పటికే తాము పలుసార్లు స్పష్టం చేశామన్నారు. దేశంలో ప్రకృతి వనరులు సకల సంపదలు ఉన్నాగాని, దేశ రైతాంగం ప్రజలు సాగునీరు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేక కష్టాలు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని పునరుద్ఘాటించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎవరు ఇవ్వని రైతురాజ్య స్థాపన నినాదాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెనా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. గ్రామీణ కమిటీల్లో ఇప్పటికే 11 లక్షల మంది సభ్యులుగా చేరారని, రానున్న కాలంలో వారి సంఖ్య 35 లక్షలకుపైగా చేరుకుంటుందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ విస్తరిస్తుందని, గ్రామ గ్రామాన తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
దేశ ప్రజలు, రైతాంగం తమ ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారని, అందులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని కిసాన్ సర్కారును స్థాపించుకుంటారనే సంపూర్ణ విశ్వాసం తనకున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా బీఆర్ఎస్ A టీమ్, B టీమ్ అంటున్నారని మరో విలేకరి ప్రశ్నించగా.. కేసీఆర్ స్పందిస్తూ.. ఇలాంటి విమర్శ చేసే వాళ్ల అభద్రతాభావానికి, ఓర్వలేని తనానికి ఈ విమర్శ నిదర్శనంగా సీఎం పేర్కొన్నారు. ‘నేను ఎవరి పేరు తీసుకోలేదు. ఎవరినీ విమర్శించట్లేదు, వీళ్లకు దేనికి బాధ? వీళ్లకి ఎందుకు ఆక్రోషం? ఏ పార్టీకి అధికారం ఇచ్చినా అది ప్రజలు ఇచ్చిందే. మేము ప్రజల దగ్గరికి వెళుతున్నాం. వారి తీర్పును కోరుతున్నాం. ఈ దేశంలో భిన్నమైన ఆలోచనలు చేయకపోతే.. మార్పు దిశగా ఈ దేశం పయనించకపోతే.. సంక్షేమం అభివృద్ధి సాధ్యం కాదు.
ఈ దేశంలో అందుబాటులో ఉన్న బొగ్గుని, విద్యుత్ ఉత్పాదన కోసం, నదీ జలాలను సాగునీరు తాగునీరు కోసం, ఇంకా అనేక సహజ వనరులను సంపదను దేశ ప్రజల సంక్షేమం కోసం వినియోగించుకునే ఆలోచన అవుట్ ఆఫ్ ది బాక్స్ దృక్పథం ఈ దేశంలోని కేంద్ర పాలకులకు లేకపోవడమే అసలు సమస్య’ అని పేర్కొన్నారు. చర్చించాల్సిన విషయాలను పక్కకు పెట్టి అనవసరమైన విషయాలను చర్చించి.. ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ చేసే కువిమర్శలను పట్టించుకోమని స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుల ఆత్మహత్యలు లేని భారతదేశమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని, మార్పు తమ లక్ష్యాన్ని బీఆర్ఎస్ ద్వారా సాధిస్తామని, తాము దేశ ప్రజల ఆధరాభిమానాలు చూరకొంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.