CM KCR | గోదావరి నదిపై ప్రాజెక్టును నిర్మించి పాత ఖమ్మం జిల్లాకు నీళ్లు సమృద్ధిగా ఇవ్వొచ్చని.. కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఆలోచించలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును నిర్మిస్తున్నదన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చ నాగేశ్వర్రావును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ వచ్చిన నాడు చాలా సమస్యలు ఉండే. కరెంటు సమస్యలు, తాగునీళ్లు లేవు. సాగునీరు అస్సలే లేదు. ప్రజలు బతుకేందుకు వలసపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. మహబూబ్నగర్లాంటి నుంచి 15లక్షల మంది బొంబాయి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పరిస్థితి. మెదక్, నల్గొండ జిల్లాల నుంచి వలసపోయి బతికిన పరిస్థితి ఉంది’ అంటూ గుర్తు చేశారు.
‘వాటన్నింటినీ బేరీసు వేసుకొని పద్ధతిగా రాష్ట్రాన్ని క్రమపద్ధతిలో ముందుకు తీసుకుపోతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ కరెంటు సమస్య రాష్ట్రం లేదు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ను రైతులు, పరిశ్రమలతో పాటు అన్ని రంగాలకు సరఫరా చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోనూ 24గంటల కరెంటు ఇవ్వడం లేదు. తెలంగాణ రైతుల బాధలు తెలుసుకాబట్టి.. కరెంటు ఆవశ్యకత తెలుసుకాబట్టి.. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఇస్తున్నాం. ఈ ప్రాంతం, భద్రాచలం, పినపాకలో మంచినీటి సమస్య ఉండేది. గిరిజనులు చెలిమల్లో నీళ్లు తాగి అంటువ్యాధులకు గురయ్యేవారు. ఇవాళ మిషన్ భగీరథ ద్వారా మారుమూల గూడానికి, తండాకు బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసుకుంటున్నాం. ఆడబిడ్డలు నీళ్లు మోయకుండా నల్లాలు పెట్టి నీళ్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. గత పదేళ్లలో కులం, మతం లేకుండా అందరినీ సమానంగా చూస్తుండడంతో ఈ రాష్ట్రంలో అలజడులు లేవు. శాంతియుత పద్ధతిలో చక్కగా ముందుకుపోతున్నది. అభివృద్ధిని సాధిస్తున్నది’ అన్నారు.
‘గోదావరి నది తరతరాలుగా ఉన్నది. గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టును పాత ఖమ్మం జిల్లాకు నీళ్లు సమృద్ధిగా ఇవ్వొచ్చు. కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఆలోచించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీతమ్మ సాగర్ నిర్మాణం జరుగుతున్నది. 75శాతం పనులు పూర్తయ్యాయి. ఒక సంవత్సరంలోగా పాత ఖమ్మంలోని పది నియోజకవర్గాలన్నీ సస్యశ్యామలమవుతుంది. ప్రగతి కాముకంగా, ప్రగతిశీలకంగా ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ పనులు చేస్తూ ముందుకెళ్తున్నాం. రైతులు పల్లెసీమల్లో చాలా ముఖ్యం. ఆ రైతులు చల్లగా ఉంటే ప్రపంచం కూడా శాంతిగా ఉంటుంది. రైతుల కోసం దేశంలో ఎక్కడా చేయని విధంగా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చాం. రైతు స్థితీకరించబడాలనే.. వ్యవస్థాయ స్థిరీకరణ జరగాలి.. రైతుల అప్పుల భారం పోవాలి.. సొంత పెట్టుబడి కలిగి ఉండాలనే ఉద్దేశంతో నాలుగైదు కార్యక్రమాలు తీసుకున్నాం. వాటర్ ట్యాక్స్ తెలంగాణలో లేదు. కాలువలు, చెరువుల ద్వారా నీటిని ఇస్తే గతంలో ట్యాక్స్ తీసుకునేది. ఇప్పుడా ఆ పద్ధతి లేదు. కరెంటు చార్జీలు కూడా లేవు. 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది. ధాన్యం కొనుగోళ్లు జరిపి ఐదారు రోజుల్లో ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం’ అన్నారు.
‘గతంలో అప్పులుంటే తీర్చే పరిస్థితి లేకపోతే.. ఇండ్ల తలుపులు, ఇంట్లోని సామాను తీసుకుపోయారు తప్పా.. రైతులను ఆదుకోవాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. దేశంలోనే తొలిసారి రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సంవత్సరానికి రెండు పంటలకు ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నాం. ఈ సారి రూ.12వేలు చేస్తామని మొన్న ప్రకటించారు. పెంచుకుంటూ పెంచుకు రూ.16వేలకు పెంచుకుంటూ పోతాం. రైతు అదృష్టం బాగాలేక చనిపోతే రైతుబీమా పెట్టుకున్నాం. రూ.5లక్షల ఆయా రైతుల కుటుంబాల ఖాతాల్లో జమవుతున్నాయి. వీటన్నింటిని మించి ధరణి పోర్టల్ను తీసుకువచ్చాం. ఈ పోర్టల్లో బ్రహ్మాండంగా ఉన్నయ్. గతంలో మాదిరిగా గోల్మాల్ తింపే పరిస్థితి లేదు. భూమిని మార్చాలంటే ఆ అధికారం మీకే ఉన్నది’ అన్నారు.