హైదరాబాద్, ఫిబ్రవరి 12 : కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏకాణా ఇవ్వకున్నా రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపించామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. శనివారం భువనగిరి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రం అన్నివిధాలా ముందుకు పోవాలంటే దేశం కూడా అన్నివిధాలా ముందుకు పోవాలి. దీని గురించి కూడా మనం తప్పక ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉండే పాలసీ రాష్ట్రంలో ఉంటది. దేశానికి సంబంధించి ఆర్థిక పాలసీలు కావొచ్చు.. ఇంకా ప్రధాన పాలసీలు కావొచ్చు కేంద్రం చేతిలో ఉంటయి. నేను మీ బిడ్డగా ఒక్కటే మాట మనవి చేస్తున్నా.. ఎనిమిదేండ్లుగా కేంద్రంలో ఎవరి గవర్నమెంట్ ఉన్నా మనల్ని పట్టించుకోలేదు. వాళ్లు సహకారం చేసినా, చేయకున్నా మన పని మనకున్నదని పంటి బిగువనో, ఒంటి బిగువనో ఏకాణా సహకరించకున్నా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయినం.
ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి
రాజకీయంగా అవసరమైనప్పుడు మర్లవడి తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేసినమో.. తెచ్చుకున్న తెలంగాణను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు కడుపు, నోరు కట్టుకొని అవినీతి లేకుండా ఈ రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతున్న పద్ధతి ఇలాగే కొనసాగాలి. ఏడేండ్ల కింద మన బతుకు ఎట్లుండె? ఇప్పుడు ఎక్కడికి వచ్చినమో ఎట్లా ఉన్నమో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ అద్భుతంగా ముందుకు సాగుతున్నది. తెలంగాణ ఇప్పుడు తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. కరెంటు మంత్రి కూడా ఈ జిల్లావాడే జగదీశ్రెడ్డి ఉన్నడు. అనేక రంగాల్లో, అనేక విషయాల్లో అనేక రాష్ర్టాలకు మనం ఆదర్శంగా ఉన్నం. మన తలసరి ఆదాయం కావొచ్చు.. అనేక రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నం. పరిశ్రమలు వస్తున్నయి, ఐటీలో రెండో స్థానంలో దూసుకుపోతున్నం. పెట్టుబడులువస్తున్నయ్. మన రాజపేటలో, మన తుర్కపల్లిలో మారుమూల తండాల్లో ఏడేండ్ల కింద భూమి ధర ఎంతుండె? ఇప్పుడెంతున్నది? మూడెకరాలు ఉంటే ఆ రైతు కోటీశ్వరుడు. రూ.20-30 లక్షల లోపు తెలంగాణలో ఎక్కడ కూడా ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ధనవంతమైతున్నది. మొహాలు కొంచెం తెల్లబడుతున్నయి. ప్రజల్లో ధీమా పెరుగుతున్నది.
దేశానికి పట్టిన దరిద్రం
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వం పరిపాలనలో అట్టర్ ప్ల్లాప్ అయ్యిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంలో కూడా అభివృద్ధి కాముక ప్రభుత్వం ఉండాలె. ఈ మతపిచ్చి బీజేపీ ప్రభుత్వం మనకు పనికిరాదు. ఎనిమిదేండ్లలో ఏ రంగంలోనూ ఏకాణా పనిచేయలేదు. ఏ రంగంలోనూ అభివృద్ధి జరగలేదు. జీడీపీ పడిపోయింది. ఆకలి సూచీలో దేశం పరువు పోతున్నది. అప్పులు ఆకాశాన్ని అంటుతున్నయ్. డంబాచారం, డబ్బాచారం, మంది మీద పడి ఏడ్వడం తప్ప వాళ్లు సాధించింది ఏదీ లేదు. బీజేపీ ఈ దేశానికి పట్టిన దరిద్రం. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకొంటే దేశానికి అంత మంచి జరుగుతది. ఆయన అన్న మాటలకు ఆవేశం, బాధ కలిగి.. ఈ దరిద్రపు గొట్టు వ్యవహారం చూడలేక, భరించలేక ఈ మాటలు అంటున్న. అంతేతప్ప వేరే ఉద్దేశం కాదు.
తెలంగాణలో చెల్లదు..
ఎవరు మాట్లాడితే వాళ్లను ఎటుపడితే అటు మాట్లాడుడు.. అబద్ధాలు ప్రచారం చేసుడు.. తెలంగాణలో చెల్లదు కాక చెల్లదు జాగ్రత్త. ప్రజా జీవితంలో ఉన్నం కాబట్టి ప్రజలకు చెప్పడం నా ధర్మం. హెచ్చరించడం నా బాధ్యత. మనం అవసరమైన సందర్భంలో చైతన్యంతో ముందుకు పోకపోతే.. సాధించుకున్న తెలంగాణలో మనకు కూడా సమస్యలు సృష్టిస్తరు. ప్రగతిశీల ప్రభుత్వాన్ని, అద్భుతమైన ప్రగతిలో ఈ దేశాన్ని, సామరస్యపూర్వక ధోరణిలో ముందుకు తీసుకుపోయే ప్రభుత్వాన్ని కేంద్రంలో నిర్మించడానికి తెలంగాణ రాష్ట్రంగా మన వంతు పని చేయాలె. ఆ చైతన్యం ప్రజల్లో ఉంటేనే రాష్ర్టానికి రక్ష.. దేశానికి రక్ష.. సమాజానికి రక్ష’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కేంద్రానిది తెలివి తక్కువ తనం కాదా?
దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నయి. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తున్న లెక్క. దేశంలో 35 వేల టీఎంసీలకు మించి వాడలేదు. దేశంలో తాకులాటలు, పీకులాటలు.. కావేరీ మీద, గోదావరి మీద కొట్లాటలు.. గొంగిడి మీద కొట్లాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తెలివి తక్కువతనం కాదా? కంట్రీ బ్యాడ్ వాటర్ పాలసీ కాదా? మీ చేతకానితనం, మీ తెలివి తక్కువతనం కాదా? 4 లక్షల మెగావాట్ల కరెంటు ఉండే దేశంలో 24 గంటల కరెంటు ఏ ఒక్క రాష్ట్రంలో ఇయ్యరు. ఇవేనా తెలివి తేటలు. ఇదేనా మీ గొప్పతనం. ఇవి వాస్తవాలు కావా? ఇవి కేసీఆర్ కవిత్వం కాదు. నేను చెప్పే లెక్కలు కేంద్ర ప్రభుత్వ లెక్కలే. పంటలు పండిస్తం. కొనుమంటే, మాకు చేతకాదు అంటరు. మరీ ఏం శాతనైతది? దేశంలో ఆకలి పెరుగుతున్నది. ఏ బీజేపీ మొగోడు సమాధానం ఇస్తాడో నాకు చెప్పాలి.